Delhi: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గత కొన్ని వారాలుగా కేసుల సంఖ్య స్థిరంగా ఉండగా, ఇప్పుడు అది క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసులు 6,815కు చేరాయి.
గత 24 గంటల్లో 324 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 68 మంది కరోనా కారణంగా మరణించారని అధికారులు వెల్లడించారు.
కరోనా వ్యాప్తిలో కేరళ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,053 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 1,109, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 691 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 559 యాక్టివ్ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 86, తెలంగాణలో కేవలం 10 కేసులే ఉన్నాయి.
ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది. మళ్లీ మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి ప్రాథమిక నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించకుండా, కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.