Rahul Gandhi: న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం (లోక్ కల్యాణ్ మార్గ్) వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు మంగళవారం (జూలై 21, 2026) హఠాత్తుగా ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర నేతలు చేతులు కట్టుకుని వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు.
కాంగ్రెస్ నేతల ఆందోళన.. పోలీసుల అదుపులోకి!
ప్రధాని నివాసం ముందు నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి (Detain) తీసుకున్నారు.
తమను పోలీసులు అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ ఆరోపించారు. విద్యార్థులపై దాడులు జరుగుతున్నా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరు విప్పడం లేదని మండిపడ్డారు. పంజాబ్ కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ.. విద్యార్థుల మాట వినకపోవడం “బీజేపీ ఉగ్రవాదం” అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లు ఇవే:
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి.
- విద్యార్థుల ఆందోళన మరియు దాడులపై హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా అధికారిక ప్రకటన చేయాలి.
- ఈ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలి.
- విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వినాలి.
- నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన హింసాత్మక ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలి.
రంగంలోకి కేంద్ర మంత్రి.. రాహుల్ గాంధీతో భేటీ!
కేంద్రం సంప్రదింపులు: లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నేతల వద్దకు పిఎంఓ సహాయ మంత్రి జిత్నా సింగ్ స్వయంగా వచ్చి మాట్లాడారు.
అమిత్ షాతో సమావేశం: ప్రధాని నివాసం బయట రాహుల్ గాంధీతో ప్రాథమికంగా మాట్లాడిన అనంతరం, పరిస్థితిని వివరించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విపక్షాలతో చర్చించి వివాదాన్ని సర్దుమణిగేలా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
