Operation Sindoor: జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయకులైన 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన శుభం ద్వివేది కూడా చనిపోయారు. ఈ దాడికి భారత ప్రభుత్వం “ఆపరేషన్ సింధూర్” ద్వారా గట్టి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం బలమైన క్షిపణి దాడులు చేసింది.
శుభం ద్వివేది భార్య ఐశన్య ద్వివేది ఈ ఆపరేషన్పై స్పందిస్తూ, ఇది సాధారణ ప్రతీకారం కాదని, తన భర్తకు అర్పించిన ఘన నివాళి అని భావోద్వేగంగా పేర్కొన్నారు. “నా భర్త త్యాగానికి ఇది నిజమైన గౌరవం. ఆయన ఆత్మ ఇప్పుడు శాంతిగా ఉంటుంది. ప్రధాని మోదీ మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు,” అంటూ పేర్కొన్నారు. ఆమె భారత సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
Operation Sindoor: శుభం తండ్రి సంజయ్ ద్వివేది మాట్లాడుతూ, “భారత సైన్యం తీసుకున్న చర్యలతో మా ప్రభుత్వంపై మాకు నమ్మకం పెరిగింది. దేశ ప్రజల బాధల్ని వినడం, దానికి తగిన స్పందన ఇవ్వడం ప్రధాని మోదీకి సాధ్యపడింది. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాం,” అని చెప్పారు.
శుభం బంధువు మనోజ్ ద్వివేది మాట్లాడుతూ, “ఇది బాధితులందరికీ న్యాయం జరిగినట్టే. మా కుటుంబం మళ్లీ కొంత ప్రశాంతతను అనుభవిస్తోంది,” అన్నారు. ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, బాధిత కుటుంబాలకు న్యాయాన్ని అందించడంలో కూడా ఒక పెద్ద దశగా నిలిచింది.
