NEET UG 2026: రద్దయిన నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. పరీక్ష ఫీజును విద్యార్థులకు తిరిగి ఇచ్చేందుకు (Refund) ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోర్టల్ను ఎన్టీఏ అందుబాటులోకి తెచ్చింది. ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులందరూ తమ బ్యాంక్ ఖాతా వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించి రీఫండ్ పొందవచ్చని తెలిపింది. ఈ ఫీజు వాపసు ప్రక్రియ మే 22న ప్రారంభం కాగా, మే 27వ తేదీ లోపు వివరాల నమోదును పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది.
ఫీజు రీఫండ్ కోసం బ్యాంక్ వివరాలు సమర్పించే విధానం (Step-by-Step):
రీఫండ్ డబ్బులు నేరుగా విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల ఖాతాకే బదిలీ అవుతాయి. కాబట్టి కింద పేర్కొన్న పద్ధతిలో ఆన్లైన్ ఫారమ్ను జాగ్రత్తగా నింపాలి:
-
స్టెప్ 1: ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్సైట్
neet.nta.nic.inను సందర్శించాలి. -
స్టెప్ 2: హోమ్పేజీలో కనిపించే “NEET 2026 Refund Portal” లింక్పై క్లిక్ చేయాలి.
-
స్టెప్ 3: మీ నీట్ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ (DOB) వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
-
స్టెప్ 4: స్క్రీన్పై ఓపెన్ అయ్యే ఫారమ్లో మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్, బ్యాంక్ పేరును తప్పులు లేకుండా నమోదు చేయాలి.
-
స్టెప్ 5: మీ పేరు స్పష్టంగా కనిపించేలా ఉన్న ఒక రద్దు చేసిన చెక్కు (Cancelled Cheque) లేదా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
-
స్టెప్ 6: వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఫారమ్ను ‘సబ్మిట్’ చేయాలి.
-
స్టెప్ 7: భవిష్యత్తు అవసరాల కోసం జనరేట్ అయ్యే ‘కన్ఫర్మేషన్ పేజీ’ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ భద్రపరుచుకోవాలి.
సర్వర్ డౌన్.. ఎన్టీఏ (NTA) కీలక సూచనలు:
ప్రస్తుతం ఒకేసారి లక్షలాది మంది విద్యార్థులు ఈ పోర్టల్ను ఓపెన్ చేస్తుండటంతో సర్వర్పై భారీ లోడ్ పడి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లాగిన్ ఎర్రర్స్ రావడం, ఓటీపీ (OTP) ఆలస్యం కావడం, సర్వర్ డౌన్ అవ్వడం వంటి సమస్యలపై ఎన్టీఏ స్పందించింది.
విద్యార్థుల కోసం ఎన్టీఏ అలర్ట్:
-
అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్డేట్ చేసిన బ్రౌజర్లను (Google Chrome లేదా Mozilla Firefox) ఉపయోగించాలి.
-
రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజాము సమయాల్లో ప్రయత్నిస్తే అప్లికేషన్ త్వరగా పూర్తవుతుంది.
-
ముఖ్య గమనిక: ఇదే తరుణంలో సైబర్ నేరగాళ్లు నకిలీ రీఫండ్ లింకులు, ఫేక్ మెసేజ్లతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే వివరాలు నమోదు చేయాలని ఎన్టీఏ గట్టిగా హెచ్చరించింది.
జూన్ 21న ‘నీట్’ రీ-ఎగ్జామ్:
మరోవైపు రద్దయిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షను తిరిగి జూన్ 21న (Re-Examination) నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే కొత్త రీ-షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు, పేపర్ లీకేజీలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఏ విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది.
