Manchu Vishnu: సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాల మద్దతు ఎంతగానో ఉపయోగపడిందని ఆయన తెలిపారు. హైదరాబాద్లో సినీ పరిశ్రమ స్థిరపడటానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం అనన్యమైనదని చెప్పారు.
ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమకు మంచి సంబంధాలు ఉంటాయని, ఈ తరహా సున్నితమైన అంశాలపై ‘మా’ సభ్యులు స్పందించడం మంచిదికాదని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం వల్ల అనవసర సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల పరిశ్రమ ఐక్యతను కాపాడుకోవాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
తాజాగా జరిగిన ఘటనలపై చట్టం తగిన చర్యలు తీసుకుంటుందని, అలాంటి విషయాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశముందని తెలిపారు. ఈ సందర్భంలో పరిశ్రమకు ఐక్యత అవసరమని మంచు విష్ణు స్పష్టం చేశారు.