MAHAA Vamsi Comment: పదే.. పదే అబద్ధాలు చెప్పడం.. ఆ అబద్ధాలను నిజం అనిపించేలా సోషల్ మీడియాను వాడు కోవడం.. వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఇదే. రాజకీయ ప్రత్యర్థుల మీద.. ఎన్నికల లబ్ధికోసం చేసే ప్రచారం.. ఇలాంటి విషయాల్లో ఆ స్ట్రాటజీ కొంతవరకు వర్కౌట్ అయింది. ఒక ఎన్నికల్లో దాని నుంచి బాగానే లబ్ది పొందారు. అలాగే అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికి ఈ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆ పార్టీ నాయకులు కూడా బాగానే వాడుకున్నారు. అంతేకాదు.. ఏదైనా విమర్శ వచ్చినప్పుడల్లా ఎదురుదాడి మంత్రంగా చేసుకుని.. అబద్ధాలను అరిచి చెబుతూ బూతు పురాణాన్ని విప్పుతూ ప్రచారం సాగించారు. అప్పుడు అది బాగానే నడిచింది. కానీ, అదే స్ట్రాటజీ.. అలంటి విధానాన్నే కుటుంబ సభ్యుల మీద కూడా ప్రయోగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
MAHAA Vamsi Comment: అవును.. కుటుంబ ఆస్తుల వ్యవహారాన్ని రచ్చ చేసుకుని.. దానిని కూడా ప్రతిపక్ష టీడీపీ కుట్ర అంటూ జగన్మోహన్ రెడ్డి పెద్ద గేమ్ ఆడబోయారు. దానిని అందిపుచ్చుకుని ఆ పార్టీ ముఖ్యనేతలుగా చెప్పుకునే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి.. నోటికొచ్చినట్టు మాట్లాడి.. అడ్డంగా బుక్ అయ్యారు. ఒకసారి వివాదాన్ని పరిశీలిస్తే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించక ముందు తన ఆస్తులన్నీ జగన్ అలాగే షర్మిల పిల్లలకు సమానంగా చెందాలని చెప్పారని షర్మిల చెబుతున్నారు. ఆ మాటను పక్కన పెట్టి.. తన పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వకపోగా.. తనను వేధిస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు తనకు చెందిన సరస్వతి ఇండస్ట్రీలో తన తల్లికి ఏమాత్రం సంబంధం లేదంటూ కోర్టుకెక్కారు జగన్మోహన్ రెడ్డి. దీంతో విషయం వీధిన పడింది. ఇటు షర్మిల.. అటు జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ఎవరి వాదన వారు వినిపించారు. అయితే, ముందే మనం చెప్పుకున్నట్టు ఇది కుటుంబ వ్యవహారం అనే విషయాన్ని జగన్ అండ్ కో మర్చిపోయారు. తమకు అలవాటైన ధోరణిలోనే ప్రతిపక్షాలపై చేసే దాడిలానే షర్మిల మీద కూడా మాటల దాడికి దిగారు.
MAHAA Vamsi Comment: చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా షర్మిల మారిపోయి.. జగన్ బెయిల్ రద్దు కావాలని చూస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. విజయసాయి రెడ్డి అయితే, షర్మిల అప్పట్లో చంద్రబాబు నాయుడును కలిసిన విషయాన్ని కూడా ఎద్దేవా చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వైసీపీ నాయకులు తమ నేత జగన్ వైపు ఉన్నామని అనుకుంటూ తమకు ఆరాధ్యుడు అని చెప్పుకునే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను అవమానాల పాలు చేస్తూ.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వస్తున్నారు. సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి సహా కొంతమంది ఈ విషయంపై వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మి రెడ్డి మాట్లాడాలంటూ బహిరంగంగానే చెప్పారు. వారి కోరిక తీర్చాలని అనుకున్నారు విజయమ్మ. భారీ బహిరంగ లేఖను వైఎస్సార్ అభిమానులను ఉద్దేశించి రాశారు.
MAHAA Vamsi Comment: అందులో స్పష్టంగా.. సూటిగా అనేక ప్రశ్నలు వైసీపీ అభిమానులకు వేశారు. అసలు వైఎస్ఆర్ అభిమానులుగా ఉన్న మీరంతా ఆయన కుటుంబ సమస్యను ఎందుకు వీధిలోకి ఈడ్చి రచ్చ చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నదంతా అబద్ధం అంటూ ఆమె ఆ లెటర్ లో స్ఫష్టంగా పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఈ విషయంలో ఎందుకు అనవసరంగా తలదూరుస్తున్నారంటూ తలంటి పోశారు. అన్నా చెల్లెళ్ళ ఆస్తి గొడవ. వారిద్దరూ చూసుకుంటారు. మధ్యలో అనవసరంగా ఎవరికీ తోచింది వారు మాట్లాడి వ్యవహారాన్ని రచ్చ చేయవద్దు అంటూ ఒకరకంగా సున్నితంగానే గట్టి హెచ్చరిక చేశారు.
MAHAA Vamsi Comment: విజయమ్మ ఉత్తరంతో మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని అర్ధం అయిపోతోంది. షర్మిలకు అన్యాయం చేస్తున్నారని తేలిపోయింది. రాజకీయాల్లో చేసినట్టు కుటుంబంలో కూడా రాజకీయాలు చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. అడ్డంగా దొరికిపోతారు. ఇప్పటికైనా రాజకీయాలకు ఈ విషయాన్ని ముడివేయకుండా.. జాగ్రత్తగా వ్యవహరించకపోతే, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజల ముందు దోషిగా మిగిలిపోతారనడంలో సందేహం లేదు.