Apsara Murder Case: హైదరాబాద్లోని సరూర్నగర్లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదుతో పాటు అదనంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
హత్యకు దారితీసిన పరిచయం
సరూర్నగర్ ప్రాంతానికి చెందిన పూజారి సాయికృష్ణకు అప్సరతో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. సాయికృష్ణకు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, అప్సరను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. ఒత్తిడిని తట్టుకోలేక సాయికృష్ణ అప్సరను గోవాకు వెళ్దామని నమ్మించి, కారులో తీసుకెళ్లాడు. శంషాబాద్లోని సుల్తాన్పల్లిలో అప్సరను హత్య చేసి, మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి సరూర్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలోని మ్యాన్హోల్లో పడేశాడు.
సాక్ష్యాధారాలతో కేసు ఛేదన
అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సాయికృష్ణ చివరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుబడ్డాడు. విచారణలో అప్సర గర్భం దాల్చిన కారణంగా పెళ్లి ఒత్తిడి పెంచిందని, కానీ ఆమె మరికొందరితో సన్నిహితంగా ఉండేదనే అనుమానంతోనే హత్య చేశానని తెలిపాడు. అప్సర మొదటిసారి గర్భవతి అయినప్పుడు అబార్షన్ చేయించిన సాయికృష్ణ, రెండోసారి గర్భం దాల్చిన విషయంపై తీవ్ర మనోవేదనకు గురై హత్యకు పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: Sougat E Modi: దేశవ్యాప్తంగా పేద ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా
కోర్టు తీర్పు
ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షులను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా, 28 మంది సాక్ష్యాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు మిగతా ఆధారాల ఆధారంగా నిందితుడి వాదనలను కోర్టు తిరస్కరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ వాదనల మేరకు కోర్టు పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. అదనంగా, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఏడు సంవత్సరాల అదనపు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలంటూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పుతో అప్సర కుటుంబానికి కొంత న్యాయం జరిగినట్లే అయినా, ఈ ఘటన సమాజానికి ఒక గుణపాఠంగా మారాలి.