Karnataka: కర్ణాటకలో ఇటీవల జరిగిన దోపిడీ సంఘటనలు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల ఘటన మరువకముందే, మంగళూరులో మరో భారీ దోపిడీ చోటుచేసుకుంది.
కేసీ రోడ్లో ఉన్న కోటేకర్ ఉల్లాల్ కోపరేటివ్ బ్యాంకు లక్ష్యంగా ఐదుగురు సాయుధ దుండగులు దోపిడీ చేశారు. తుపాకులు, కత్తులు, చాకులు పట్టుకుని బ్యాంకులోకి చొరబడ్డ దుండగులు సిబ్బందిని బెదిరించి రూ.12 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదును దోచుకున్నారు. ఈ దొంగలు బంగారం, నగదును నాలుగైదు బ్యాగుల్లో నింపుకొని అక్కడ్నుంచి పరారయ్యారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, బ్యాంకు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణం, దోపిడీ జరిగిన సమయంలో బ్యాంకులోని సీసీ కెమెరాలు మరమ్మతుల కోసం టెక్నీషియన్ వద్దకు పంపించబడి ఉండటమే.
ఇంకా, సీఎం సిద్ధరామయ్య మంగళూరులో పర్యటిస్తున్న సమయంలో పోలీసులు ఆయన బందోబస్తుకు వెళ్లడం, దొంగలు ఈ సందర్భాన్ని అదనుగా వాడుకుని దోపిడీ జరిపినట్టు భావిస్తున్నారు.
అదేవిధంగా, బీదర్లో ఇటీవల ఏటీఎం దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో నిందితులు హైదరాబాద్కు పారిపోయారు. దోపిడీ కేసులో వారిని వెదుకుతూ బీదర్ పోలీసులు హైదరాబాద్కు చేరుకున్నారు. ట్రావెల్స్ మేనేజర్ అనుమానం వ్యక్తం చేయడంతో, దొంగలు అతనిపై కాల్పులు జరిపి పారిపోయారు.
ఈ వరుస సంఘటనలు కర్ణాటకలో భద్రతాపరమైన చర్యలను పునరాలోచించాల్సిన అవసరాన్ని ఉద్భోధిస్తున్నయి.