Heatwave Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు వడగాలులు తోడవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 40 మంది వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాబోయే మరో ఐదు రోజుల పాటు ఈ వేడిగాలుల తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. గడిచిన రెండు రోజుల్లో ఇక్కడ 30 మంది వడదెబ్బకు బలయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది; ఇక్కడ రెండు రోజుల్లోనే 16 మంది చనిపోయారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా నిప్పుల కుంపటిలా మారింది. జిల్లాలో ఎండలు 46 డిగ్రీలు దాటగా, ఖమ్మం రూరల్ పల్లీగూడెంలో అత్యధికంగా 46.3 డిగ్రీల వేడి నమోదైంది. ఇక్కడ వడదెబ్బతో 12 మంది మృతి చెందారు. మనుషులే కాదు, మూగజీవాలు కూడా ఈ ఎండలకు విలవిలలాడుతున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్లో ఒక ఎద్దు ఎండ వేడిని తట్టుకోలేక చనిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోనూ వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం విజయవాడ నగరంలోనే వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బ తగిలి 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. చనిపోయిన వారిలో రోజువారీ కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు రోడ్లపై ఉండే యాచకులు కూడా ఉన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎండ నుంచి ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేసినప్పటికీ మరణాలు సంభవించడంతో అధికారులు అన్ని పోలీస్ స్టేషన్లను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఈ ప్రాణాంతకమైన వేడిగాలులు రెండు రాష్ట్రాల్లోనూ మరో ఐదు రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఏపీలోని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ స్పందిస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎండలో పనిచేసే కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు మధ్యాహ్నం వేళల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అటు తెలంగాణలో కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ వంటి జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్లో కూడా ఈ సెగలు గట్టిగానే ఉంటాయని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని.. ఎక్కువగా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) లవణాల నీటిని తాగుతూ ప్రాణాలను కాపాడుకోవాలని వైద్యులు, అధికారులు కోరుతున్నారు.
