Bhogapuram Airport: ఉత్తరాంధ్ర మన్యం సంస్కృతి, గిరిజన కళారూపాల వైభవం ప్రపంచ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన బృహత్తర సాంస్కృతిక ప్రదర్శన అత్యంత ప్రతిష్ఠాత్మక ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో స్థానం సంపాదించుకుంది.
రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏ (ITDA) పరిధిలోని పాఠశాలలకు చెందిన 13,000 మంది గిరిజన బాలికలు, మహిళలు ఏకకాలంలో గులాబీ రంగు, ఆకుపచ్చ అంచుల సాంప్రదాయ చీరలు ధరించి లయబద్ధంగా చేసిన ‘ధింసా’ నృత్య విన్యాసం అందరినీ మైమరిపించింది.
గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్న మంత్రి సంధ్యారాణి
ఈ చారిత్రాత్మక ప్రదర్శనను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు నిశితంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా విజయం సాధించినట్లు ప్రకటించారు.
-
మంత్రి సంబరం: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం తరఫున గిన్నిస్ అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
-
స్టెప్పులేసిన మంత్రి: వేడుకలో మంత్రి సంధ్యారాణి స్వయంగా గిరిజన విద్యార్థినులతో కలిసి ధింసా నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన మన్యం కళలను విశ్వవ్యాప్తం చేయడం ఎంతో గర్వకారణమని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పర్యటన – పూర్తి షెడ్యూల్ ఇదే:
గిన్నిస్ రికార్డు సృష్టించిన ఈ ధింసా నృత్యంతోనే శనివారం భోగాపురం చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థినుల కూచిపూడి నృత్య ప్రదర్శనతో మోదీకి ఆహ్వానం లభించింది.
గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం.. మోదీ ఓపెన్ టాప్ జీప్లో ప్రజలకు అభివాదం చేస్తూ భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం మధ్యాహ్నం ప్రధాని తిరుగు ప్రయాణమయ్యారు.
విశాఖ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని పర్యటన మరియు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖపట్నం, విజయనగరం జాతీయ రహదారులపై పోలీసులు భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. సభకు వచ్చే ప్రైవేటు, ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక రూట్లను కేటాయించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
ధింసా నృత్య గిన్నిస్ రికార్డుతో ప్రారంభమైన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది!
