Viral News: ఇండియాలో బాబాలకి ఉన్న క్రేజ్ ఏ పాన్ ఇండియా హీరోకి తీసిపోదు అని చెప్పొచ్చు.. కొన్నిసార్లు అయితే పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వారి ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి కూడా చాలానే చూశాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. హర్యానాకు చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక ప్రచారకుడు సంత్ రాంపాల్ (Sant Rampal) 11 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన అనంతరం మళ్లీ ప్రజల ముందుకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన తన అనుచరులకు దర్శనమిచ్చిన వింత తీరుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యాధునిక హంగులతో ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్ కండిషన్డ్ (AC), హైడ్రాలిక్ గ్లాస్ క్యాబిన్ వాహనంలో కూర్చుని ఆయన భక్తులకు దర్శనమిచ్చారు.
హైడ్రాలిక్ గ్లాస్ వాహనం – వైరల్ వీడియో విశేషాలు..
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే పూర్తిగా అద్దాలతో మూసివేసిన (Glass-sided) హైడ్రాలిక్ వాహనంలో రాంపాల్ కోసం ఒక ప్రత్యేక కుర్చీ, ఏసీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో భక్తుల కంటే ఎత్తులో కుర్చీలో కూర్చొని ఉండగా కింద ఉన్న భక్తులు ఆయన కాళ్లను తాకుతూ నమస్కరిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఆయన కూర్చున్న గ్లాస్ వాహనం లోపలే ఒక విరాళాల పెట్టె (Donation box) కూడా ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
11 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం – నేపథ్యం..
2014 నవంబర్ 19న హర్యానా బర్వాలాలోని ‘సత్లోక్ ఆశ్రమం’లో రాంపాల్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లినప్పుడు భారీ హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనల అనంతరం అరెస్టయిన రాంపాల్ సుమారు 11 ఏళ్లకు పైగా హిసార్ సెంట్రల్ జైలులో ఉన్నారు. దేశద్రోహం కేసులో పంజాబ్ & హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
అయితే గతంలో 2014 నాటి ఘటనలకు సంబంధించి రెండు హత్య కేసుల్లో ఆయనపై నేరారోపణలు రుజువయ్యాయి. జైలు నుంచి విడుదలైన అనంతరం రాంపాల్ మళ్లీ తన ఆశ్రమ కార్యకలాపాలను ప్రారంభించగా.. వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆయనను దర్శించుకుంటున్నారు.
View this post on Instagram
