Ganesh Mandapam: వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా, భద్రమైన వాతావరణంలో జరుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే కమిటీలు అనుమతుల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు లేకుండా ఆన్లైన్ సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, రాష్ట్రస్థాయిలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్సవాల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఒకే పోర్టల్.. అన్ని శాఖల క్లియరెన్స్..
ఉత్సవ నిర్వాహకులు ఎక్కడికీ వెళ్లకుండా నేరుగా
[https://ganeshutsav.net/](https://ganeshutsav.net/) పోర్టల్ లేదా ‘ఏపీ పోలీస్ సేవా పోర్టల్’ ద్వారా ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీస్, మున్సిపల్/జీవీఎంసీ, అగ్నిమాపక (ఫైర్), విద్యుత్ (డిస్కం), కాలుష్య నియంత్రణ మండలి/రెవెన్యూ శాఖల అనుమతులన్నీ ఒకే దరఖాస్తుతో ఆన్లైన్ ద్వారానే లభిస్తాయి.దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు మండప స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ట్రాఫిక్ సమస్యలు, అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన సూచనలు చేసి అనుమతి మంజూరు చేస్తారు.
తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు:
దర్శనాలు, పూజలు లేదా మండపాల పేరుతో ప్రజల నుంచి, వ్యాపారుల నుంచి బలవంతపు చందాలు వసూలు చేయడం తీవ్ర నేరమని సీపీ హెచ్చరించారు. అలాంటి ఫిర్యాదులు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు.
-
డీజేలపై పూర్తి నిషేధం:నిమజ్జనం, శోభాయాత్రల సమయంలో అధిక శబ్దాలు చేసే డీజేలు (DJs), భారీ లౌడ్ స్పీకర్ల వాడకంపై పూర్తి నిషేధం ఉంది. అనుమతించిన పరిమితుల్లోనే సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించాలి.
-
భద్రతా చర్యలు & సీసీ కెమెరాలు:భారీ విగ్రహాలు, పెద్ద మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి. రాత్రి వేళల్లో స్వచ్ఛంద సేవకులతో కాపలా ఏర్పాటు చేసుకోవాలి.
-
పర్యావరణ హితం:కాలుష్య నివారణ కోసం మట్టి వినాయక విగ్రహాల (క్లే గణపతి) వినియోగాన్ని ప్రోత్సహించాలని పోలీస్ యంత్రాంగం పిలుపునిచ్చింది.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.
