Financial Crisis in Pakistan

Financial Crisis in Pakistan: భారత్‌ దెబ్బకు అప్పులు అడుక్కుంటున్న పాక్‌..

Financial Crisis in Pakistan: చేతిలో చిల్లి గవ్వ లేదు. ప్రపంచమంతా అప్పులు. అయినా.. ఉగ్రవాదుల కోసం భారత్‌తో యుద్ధానికి రెడీ అయ్యింది పిచ్చి పాకిస్తాన్‌. ఎంతైనా ఉగ్రవాదులంటే తన కడుపులో దాచుకుని, పెంచి పోషిస్తున్న కన్నబిడ్డలే కదా పాకిస్తాన్‌కు. మన డ్రోన్లు కుప్ప కూల్చిన లాహోర్‌లోని పాక్‌ రాడార్‌ సిస్టం ఖరీదు 1600 కోట్లట. ఇక మొత్తం భారత్‌ సృష్టించిన విధ్వంసం ఖరీదెంతో పాక్‌కి లెక్క వేసుకోవడానికే రెండ్రోజులు పట్టేట్టుంది. పాక్‌ ఇంకా ఇలాగే కాలుదువ్వితే.. చిప్ప పట్టుకుని అడుక్కున్నా ప్రపంచంలో ఎక్కడా చిల్లి గవ్వ అప్పు పుట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భారత్‌ చేస్తోంది సైనిక, వైమానిక యుద్ధం మాత్రమే కాదు.. దానికి సమాంతరంగా దౌత్య యుద్ధం కూడా. మొత్తానికి ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పాకిస్తాన్‌ ఆర్థిక భవిష్యత్‌ ఏంటి?

పాకిస్థాన్ భారత్‌పై చేసిన సైనిక దాడుల వల్ల, అది ఊహించిన దానికి భిన్నంగా, భారత్‌ కంటే తనకే ఎక్కువ నష్టం కలుగుతోంది. అసలు యుద్ధం చేయడానికి కాదు కదా.. దానికి అలవాటైన కవ్వింపులకు కూడా ఇప్పుడు పాక్‌ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. పాకిస్థాన్ ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ – IMF నుండి 7 బిలియన్ డాలర్ల బెయిల్‌ అవుట్ ప్యాకేజీపై ఆధారపడి ఉంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు జరిగే యుద్ధం దాని ఆర్థిక వ్యవస్థను మరింత క్షీణింపజేస్తుంది. IMF ఈ అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుంది. భారత్ ఇప్పటికే తన అభ్యంతరాలను IMF వద్ద స్పష్టంగా వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌కు ఇప్పటివరకు IMF నుండి 6.2 బిలియన్ డాలర్ల రుణాలు ఉన్నాయి. 1950లో IMF సభ్యదేశం అయినప్పటి నుండి పాకిస్థాన్ 25 సార్లు రుణాలు తీసుకుంది. అలాగే, వరల్డ్ బ్యాంక్ నుండి 48 బిలియన్ డాలర్లకు పైగా సహాయం పొందింది. 2024లో పాకిస్థాన్ బాహ్య రుణం 130బిలియన్ డాలర్లకు చేరింది. జనవరి 2025లో, వరల్డ్ బ్యాంక్‌తో 10 సంవత్సరాల కాలానికి 20 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది.

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంగా సంక్షోభంలో ఉంది. చైనా, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుండి ఆర్థిక సహాయం…. IMF, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుండి రుణాలపై ఆధారపడి బతుకీడుస్తోంది పాక్‌. దీర్ఘకాల వాణిజ్య లోటు, తక్కువ పన్ను ఆదాయం, అధిక ప్రభుత్వ రుణం వంటి సమస్యలతో పాక్‌ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. భారత్‌పై ద్వేషంతో అధిక రక్షణ బడ్జెట్ కేటాయింపులు చేసి ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేసుకుంది పాకిస్తాన్‌. అధిక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి కారణంగా పాకిస్థాన్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువ నిపుణులు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, పాకిస్థాన్ తన దృష్టిని ఉగ్రవాదంపైనే కేంద్రీకరిస్తోంది. పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ 1961లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఇండస్ వాటర్స్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు సంజయ్ బంగా మే 8, 2025న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో సమావేశమై, ఈ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో సింధు జలాల విషయంలో వలర్డ్‌ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంపై పాక్‌ పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయే పరిస్థితి.

ALSO READ  Narendra Modi: మోడీ క్యాబినెట్ రైతులకు బహుమతి!

ఇది కూడా చదవండి: India VS Pakisthan: దేశంలో తాత్కాలికంగా 32 విమానాశ్ర‌యాల మూసివేత‌.. అవి ఇవే..

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా, భారత్ మే 7, 2025న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని, పౌరులకు లేదా సైనిక సౌకర్యాలకు నష్టం కలగని విధంగా జరిగాయని విక్రమ్ మిస్రీ తెలిపారు. అయితే, పాకిస్థాన్ ఈ దాడులకు ప్రతిస్పందనగా భారత్‌లోని సైనిక మరియు పౌర ప్రాంతాలపై డ్రోన్లు మరియు క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులను భారత్ విజయవంతంగా నిరోధించింది. గత 15 రోజుల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ మరియు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ షెల్లింగ్‌లో 18 మంది భారతీయులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. దీనికి ధీటుగా బదులిస్తూ భారత్‌.. ఆపరేషన్‌ సింధూర్‌ని కొనసాగించింది. సింధూర్‌ 2.0లో భాగంగా కరాచీ పోర్టును లేపేసింది. లాహోర్‌లోని పాక్‌ ఎయిర్‌ రాడార్‌ సిస్టమ్‌ని ధ్వంసం చేసి పడేసింది. దీంతో పాక్‌ చవిచూసిన నష్టం మామూలు నష్టం కాదు. ఇప్పటికే దరిద్రంలో కొట్టి మిట్టాడుతున్న పాక్‌కి.. ఇప్పుడు కొన్ని వేల కోట్లలోనే నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా.

IMF నుండి 2 బిలియన్ డాలర్ల తక్షణ రుణం పొందాలని పాకిస్థాన్ ఆశిస్తోంది. అయితే, భారత్ తన అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తం చేస్తూ, పాకిస్థాన్ ఈ నిధులను సైనిక-ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తోందని ఆరోపించింది. “పాకిస్థాన్ విషయంలో వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తాయి, ఈ దేశానికి ఉదారంగా ఆర్థిక సహాయం అందించే వారు ఈ విషయాన్ని గమనించాలి” అంటూ మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌ భారత కార్యదర్శి విక్రం మిస్రీ ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు. కండకావరంతో కాలుదువ్వుతున్న పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ఆర్థిక భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెడుతోంది. పాక్‌ ప్రస్తుతం ఆధారపడిన IMF రుణాలు పొందినప్పటికీ, దాని ఉగ్రవాద మద్దతు చర్యలు, అర్థం పర్థం లేని సైనిక దాడులు ప్రపంచం ముందు బట్టబయలైన కారణంగా భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు… పాక్‌కి అందించే రుణ సహాయాన్ని పరిమితం చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే… భారత్‌తో కాని సమయంలో కాలు దువ్వి పాక్‌ తన ఆర్థిక భవిష్యత్తు స్వయంగా తానే నాశనం చేసుకుంటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *