AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బెంబేలెత్తిస్తున్న లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కోట్లాది రూపాయల అక్రమ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), శుక్రవారం (మే 16) నాడు నాటి సీఎంవో కార్యదర్శి కె. ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది.
మూడు రోజుల విచారణ అనంతరం అరెస్ట్
విజయవాడలోని సిట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు ఈ ఇద్దరిని విచారించిన అధికారులు, నేరుగా అరెస్ట్కు వెళ్లారు. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరుసగా A31, A32 నిందితులుగా నమోదు కాగా, ఇప్పటికే A33 నిందితుడిగా ఉన్న భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కూడా అరెస్ట్ అయ్యారు.
పిడిషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఇద్దరు నిందితులు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం వారి పిటిషన్లను ఖండించింది. విచారణ కీలక దశలో ఉండటంతో బెయిల్ ఇవ్వలేమని, ప్రత్యక్ష సాక్ష్యాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. “ముందస్తు బెయిల్ ఇచ్చినట్లయితే దర్యాప్తు అధికారుల చేతులు కట్టేసినట్లవుతుంది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Crime News: శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలుడు..ముగ్గురు మృతి!
వైఎస్సార్సీపీ పాలనలో సంభవించిన భారీ స్కాం
ఈ కేసు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిట్ గుర్తించింది. అప్పటి సీఎంవో కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో నేరుగా ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు వెలుగుచూశాయి.
సిట్ దూకుడు – రాజకీయ ఉత్కంఠ
సిట్ ఒకవైపు నేరుగా అరెస్టులు చేస్తూ దర్యాప్తును ముమ్మరం చేస్తుండగా, మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సిట్ పావులు కదుపుతోందనే ప్రచారం వేడెక్కుతోంది. కేసులో నెక్ట్స్ ఎటు వాలుతుందనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.