North Korea: ఉత్తర కొరియా (North Korea) సర్వాధికారి కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) గత రెండు నెలలుగా బయటకు రాకపోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. క్షిపణి ప్రయోగాలు, సైనిక విన్యాసాలు, ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాల్లో నిత్యం కెమెరాల ముందుకు వచ్చే కిమ్.. జూన్ 9న చైనా ప్రతినిధులతో సమావేశమైన తర్వాత మళ్లీ మీడియా కంటికి కనిపించలేదు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన 73వ కొరియన్ యుద్ధ వార్షికోత్సవ వేడుకలకు సైతం ఆయన రాకపోవడంతో ఆయనకు ఏమైంది? ఎక్కడికి వెళ్లారు? అనే సందేహాలు మొదలయ్యాయి.
కిమ్ లేకపోవడంతో రంగంలోకి దిగిన ముఖ్య అధికారులు!
ఉత్తర కొరియా లాంటి కఠినమైన నియంతృత్వ దేశంలో దేశాధినేత మీడియా ముందుకు రాకపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆయన లేకపోవడంతో ఇటీవల జరిగిన ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలను ఇతర అధికారులు పూర్తి చేశారు..
-
ఫ్యాక్టరీల తనిఖీ: ప్యాంగ్యాంగ్లోని లోకోమోటివ్ కాంప్లెక్స్ తనిఖీకి ప్రధాని పాక్ థే సాంగ్ నేతృత్వం వహించారు.
-
పాఠశాలల ప్రారంభం: నాంఫోలోని నూతన చిల్డ్రన్స్ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
-
సైనిక ప్రకటనలు: అమెరికా, జపాన్, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలపై ప్రభుత్వ ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి తప్ప, కిమ్ వ్యాఖ్యలు కానీ ఫొటోలు కానీ రాలేదు.
కనిపించకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి?
విశ్లేషకులు మరియు ఇంటెలిజెన్స్ వర్గాలు కిమ్ గైర్హాజరీపై పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..
-
విపరీతమైన ఎండలు & వేడి: ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరుకోవడంతో పాటు తీవ్రమైన తేమ వాతావరణం నెలకొంది. అధిక బరువు, ధూమపానం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కిమ్ను ఎండల్లో బయటకు రావద్దని వైద్యులు సలహా ఇచ్చి ఉండవచ్చని ఒక వాదన.
-
ప్రైవేట్ రిసార్ట్ పర్యటన: వేసవి కాలంలో కిమ్ సాధారణంగా వోన్సాన్లోని తన సొంత లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంటారు.
-
ఆరోగ్య సమస్యలు & వదంతులు: గతంలో 2014, 2020లలో కూడా కిమ్ ఇలాగే కొన్ని వారాల పాటు గైర్హాజరై శస్త్రచికిత్సలు చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, లేదా చనిపోయారని, ప్రస్తుతం డమ్మీ (Body Double)ని ఉపయోగిస్తున్నారనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అంతర్జాతీయంగా ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నప్పటికీ, కిమ్ ఆరోగ్యంపై లేదా ఆయన ఎక్కడున్నారనే దానిపై ఉత్తర కొరియా అధికారిక మీడియా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
