Kurnool: మెగా డీఎస్సీ 2025 నియామకాలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేస్తున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలపై బాధితులుగా మారిన ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు సీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురంల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు శనివారం (ఆగస్టు 8, 2026) కర్నూలు నగరంలో ‘చలో కర్నూలు’ పేరుతో భారీ ఆత్మగౌరవ ప్రదర్శన చేపట్టారు.
కొండారెడ్డి బురుజు వద్దకు భారీగా చేరుకున్న ఉపాధ్యాయులు, బురుజుపైకి ఎక్కి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
రాత్రింబవళ్లు కష్టపడి ఉద్యోగం సాధిస్తే అక్రమాలని ముద్ర వేస్తారా?
స్టడీ హాల్స్లో, చిన్న చిన్న రూమ్లలో రాత్రింబవళ్లు కష్టపడి చదివి మేము నిజాయితీగా ఉద్యోగాలు సాధించాం. కానీ వైఎస్సార్సీపీ నేతలు ఎలాంటి ఆధారాలు లేకుండా మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మా ఉపాధ్యాయ వృత్తినే కించపరుస్తున్నారు. నిరాహార దీక్షల పేరుతో జెన్-జెడ్ నాటకాలు ఆడుతున్నారు. పాఠాలు చెప్పడమే కాదు.. మాపై కుట్రలు చేస్తే ఎలా గుణపాఠం చెప్పాలో కూడా మాకు తెలుసు!— ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ ఆఫీస్ వరకు కిక్కిరిసిన రహదారులు
గత ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వక నిరుద్యోగులను వంచించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకంతోనే 16,000కు పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలపై రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.
