Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం బెగ్గిపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంటింటికీ స్వయంగా వెళ్లి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను విచారించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో తిరుగుతూ లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం ముగ్గురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్నతాయమ్మకు వితంతు పింఛను, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛను అందించి వారికి భరోసా కల్పించారు.
ముఖ్యమంత్రి నేరుగా తమ ఇంటికి వచ్చి పింఛన్లు అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు
