Ajay Bhupathi: మహేష్ బాబుతో అజయ్ భూపతి సినిమా చేయాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా అసలు అంచనాలు లేకుండా వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమా హిట్ అవ్వగానే హీరో, హీరోయిన్, డైరెక్టర్ జీవితాలు మారిపోయాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికీ గ్యాప్ లేకుండా అవకాశాలు వచ్చాయి. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా హిట్ అవ్వగానే సూపర్ స్టార్ మహేష్ బాబు అజయ్ భూపతిని ఇంటికి పిలిపించుకొని, తన నెక్స్ట్ సినిమా కోసం ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగారంట. అది ఊహించని అజయ్ భూపతి వెంటనే తన దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి చారిత్రక అంశాలు, హంపి నగరం చుట్టూ ఉన్న అనేక రహస్యాలు, మిస్టరీల నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ లైన్ను చెప్పారు. అది విన్న మహేష్ బాబు “ఈ స్టోరీలో చాలా డెప్త్ ఉంది. ఇప్పుడు ఈ స్టోరీ చేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్ లేక అందులో ఉన్న డెప్త్ మిస్ అవుతుంది. అందుకే ఈ స్టోరీని డ్రీమ్ ప్రాజెక్ట్గా ఉంచుకొని ఇంకా డెవలప్ చేస్తూ, ఈలోగా ఏదైనా కమర్షియల్ స్టోరీతో హిట్ కొట్టమని” చెప్పారంట. ఈ విషయాన్ని స్వయంగా అజయ్ భూపతే చెప్పారు.
‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) సినిమాతో మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా జులై 29న రిలీజ్ కానుంది. రిలీజ్కి తక్కువ సమయం ఉండటంతో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగానే మహేష్ బాబుతో తనకు జరిగిన ఈ సంఘటన గురించి అజయ్ భూపతి చెప్పుకొచ్చారు. మరి అజయ్ భూపతి భవిష్యత్తులో ఒక కమర్షియల్ కథతో మహేష్ను మెప్పిస్తారేమో చూడాలి.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ‘వారణాసి’ విజయంతో వచ్చే క్రేజ్ను బట్టి తర్వాత ఎలాంటి సినిమా చేయాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
