Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే నంబర్ వన్ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన 3,000 మంది పేదలకు ఆయన చేతుల మీదుగా ఉచితంగా శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
మంగళగిరి తన సొంత నియోజకవర్గమని, గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఏకంగా 91 వేల ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చారని ఈ సందర్భంగా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.
1. రూ.1000 కోట్ల విలువైన భూమి.. శాశ్వత హక్కు!
దశాబ్దాలుగా తమ స్థలాలు, ఇళ్లు ఎక్కడ లాక్కుంటారోననే భయంతో బతికిన పేదలకు ఈరోజుతో ఆ భయం పోయిందని, కూటమి ప్రభుత్వం వారికీ భూమిపై శాశ్వత హక్కు కల్పించిందని లోకేష్ తెలిపారు.
సుమారు ₹1,000 కోట్ల విలువైన భూమిని ఇళ్ల పట్టాల రూపంలో అందిస్తున్నామని, వీటిపై బ్యాంకుల్లో రుణాలు (Loans) కూడా పొందే వెసులుబాటు ఉంటుందన్నారు.
2019 ఎన్నికల్లో 5,300 ఓట్లతో ఓడిపోయినప్పటికీ, ప్రజల మనసు గెలవాలనే కసితో ఐదేళ్లు కష్టపడి పనిచేశానని.. 2024లో రాష్ట్రంలోనే టాప్-3 మెజారిటీ ఇచ్చిన మంగళగిరి ప్రజల నమ్మకమే తనను ముందుకు నడిపిస్తోందని చెప్పారు.
2. మంగళగిరి అభివృద్ధి & రాష్ట్ర పథకాలు
నియోజకవర్గంలో 24 గంటల తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, శ్మశానాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వీటితోపాటు రూ.4,000 పింఛన్, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్న క్యాంటీన్లు వంటి హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో రూపాయి ఆదాయానికి రూ.1.60 ఖర్చు ఉండేదని, రెండేళ్లుగా పరిశ్రమలు తెచ్చి ఆ ఖర్చును రూ.1.40 కి తగ్గించామని వివరించారు.
3. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ధన్యవాదాలు
చంద్రబాబు నాయుడిని తప్పుడు కేసులో అరెస్ట్ చేసిన కష్టకాలంలో పవన్ కల్యాణ్ తమ కుటుంబానికి అన్నలా అండగా నిలిచారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని.. అమరావతి, పోలవరం నిధులతో పాటు విశాఖ రైల్వే జోన్ కల నెరవేర్చారని చెప్పారు.రూపాయి లంచం లేకుండా, ఒక టీ కప్పు కూడా తీసుకోకుండా మూడు పార్టీల నేతలు పారదర్శకంగా ఇంటింటికీ వెళ్లి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందించారని తెలిపారు.







