Boxer Murdered: చెన్నైలోని తిరువల్లికేణిలో ప్రముఖ బాక్సర్ను నరికి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.తిరువల్లికేణి కృష్ణంపేట ప్రాంతానికి చెందిన రాజేష్-రాధ దంపతుల కుమారుడు ధనుష్ (24). బాక్సర్ అయిన అతను తమిళనాడు తరపున పలు బాక్సింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు.
పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్న అతడిపై ఇంటి దగ్గర యువకులతో గొడవ జరగడంతో కేసు నమోదైంది. దీంతో అతని పోలీసు కల చిక్కుల్లో పడింది.
ఈ క్రమంలో అతను నిన్న రాత్రి తన స్నేహితుడితో తన ఇంటి దగ్గర నిలబడి ఉండగా, కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అతనిని కొడవలితో దారుణంగా నరికి చంపారు. మెడ, శరీర భాగాలపై తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని ఆపడానికి ప్రయత్నించిన ధనుష్ స్నేహితుడు అరుణ్ మెడపై కూడా కత్తి గాయం అయింది.
విషయం తెలుసుకున్న ఐస్ హౌస్ పోలీసులు ధనుష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన అరుణ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ హత్య కేసులో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
