BJP: తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టాలని సీరియస్గా హెచ్చరించినట్టు తెలిసింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కాకుండా ఏకరీతిన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పార్టీ వాయిస్ను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని సూచించారని, కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను కొట్టేసే అవకాశాన్ని బీజేపీ దక్కించుకోవాలని హితబోధ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో ఉండాలని, గెలుపే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారని తెలిసింది.
BJP: మహారాష్ట్రలో భారీ విజయం నేపథ్యంలో తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే వ్యూహంలో భాగంగా బీజేపీ అధిష్ఠానం తెలంగాణ ముఖ్యనేతలను నిన్న ఢిల్లీకి పిలిపించుకన్నది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, డీ అర్వింద్, రఘునందన్రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి 17 మంది ప్రధాని మోదీతో జరిగిన భేటీకి హాజరయ్యారు.
BJP: తెలంగాణ నుంచి వెళ్లిన 17 మంది ముఖ్య నేతలను ప్రధాని పేరుపేరునా పిలవడం విశేషం. తొలుత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజల రియాక్షన్ ఏవిధంగా ఉన్నదోనని ముందుగా ప్రధాని తెలుసుకున్నారు. గ్యారెంటీలు అమలు గాక, అస్తవ్యస్థ పాలనతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ప్రధానికి రాష్ట్ర బీజేపీ నేతలు వివరణ ఇచ్చారని సమాచారం. ఇదే విషయాన్ని వారి నుంచి రాబట్టేందుకే బీజేపీ పెద్దల ప్లాన్గా భావిస్తున్నారు. ఈ దశలో మోదీ వారితో మాట్లాడుతూ సున్నితంగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
BJP: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉంటే దానిని బీఆర్ఎస్ క్యాష్ చేసుకుంటుందనే, ప్రజలు బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారని.. దీనిపై తనకు సమగ్ర సమాచారం ఉన్నదని మోదీ తేల్చి చెప్పారట. ఇప్పుడే బీజేపీ పొజిషన్ తీసుకోవాలని చెప్పారట. ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరాడాలని, వచ్చే ఎన్నికల నాటికి అధికారమే పరమావధిగా ముఖ్య నేతలంతా ఐకమత్యంగా పనిచేయాలని సూచించారట. ఎవరికి వారుగా కాకుండా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలకు భరోసా ఇవ్వాలని చెప్పారట.
BJP: సమావేశ అనంతరం ప్రధాని ఎక్స్లో పెట్టిన పోస్టుపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, బీఆర్ఎస్ లాగే ప్రస్తుత పాలన కొనసాగుతుందని, బీజేపీ క్రమంగా విస్తరిస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ పోరుబాట పట్టాలని చెప్పకనే చెప్పినట్టయింది. ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యక్రమాలపై ఏకంగా మద్దతు ఇచ్చిన కొందరు ముఖ్య నేతల గొంతులో పచ్చి ఎలక్కాయ పడ్డట్టయింది.
BJP:ఎవరికి వారుగా చేపట్టే కార్యక్రమాలు బంద్ పెట్టాలని సున్నితంగా హెచ్చరించారని సమాచారం. అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికైనా ఒక క్లారిటీ వచ్చినట్టు సమాచారం. వచ్చేనెలలో ప్రకటిస్తామని, అందరూ సమ్మతించాలని, వ్యతిరేకతను ప్రదర్శించవద్దని, పార్టీ గెలుపే లక్ష్యం కావాలని మోదీ హితబోధ చేశారని వినికిడి.