AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (జూన్ 24) ఉదయం 11 గంటలకు అమరావతిలో కీలక మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఈ సమావేశంలో, ఇటీవల 7వ ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) ఆమోదించిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.28,546 కోట్ల భారీ పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊపు రానుంది.
రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించడానికి రూ.1052 కోట్లతో టెండర్ పిలవడానికి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే, సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవే-16కు కలిపేందుకు రూ.682 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కూడా అనుమతి లభించనుంది. అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
Also Read: Krishnam Raju Approver: జర్నలిస్టు కృష్ణంరాజు మరో సంచలన వీడియో.. త్వరలో!
AP Cabinet Meeting: విశాఖపట్నంలో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై చర్చించి, దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రైతు సంక్షేమానికి సంబంధించి ‘అన్నదాత సుఖీభవ’ పథకం విధి విధానాలను రూపొందించి, వాటిపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఏడాది పాలన పూర్తియిన సందర్భంగా సాధించిన ప్రగతిపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. క్యాబినెట్ సమావేశం అనంతరం, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలు ఏపీ భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేయనున్నాయి.