Revanth Reddy

Revanth Reddy: కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు..!

Revanth Reddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌తో పాటు బీఆర్ఎస్ అగ్రనేతల భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను అధికారికంగా ఆదేశించారు. నోటీసులు జారీ చేసి, సరిగ్గా 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని డెడ్‌లైన్ విధించారు. ఒకవేళ నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపైనే చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు.

ప్రభుత్వ భూములుంటే పేదలకు పంచుతాం – ఎస్సీలే యజమానులు..

కేసీఆర్ ఫామ్‌హౌస్ అధీనంలో ఏకంగా 700 ఎకరాలు ఉన్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. అందులో ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయో తేల్చాలని ఆదేశించారు. ఫామ్‌హౌస్ పరిధిలో అక్రమంగా చేజిక్కించుకున్న ప్రభుత్వ భూములు ఏవైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకుని, ఎస్సీలను ఆ భూములకు యజమానులుగా చేస్తూ పేదలకు పంచుతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
సత్యం స్కామ్ భూములు – కేటీఆర్, హరీష్‌రావులపై తీవ్ర ఆరోపణలు..
గతంలో సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో ఉన్న వివాదాస్పద భూములు కేటీఆర్ బంధువుల పేర్లతో బదిలీ అయ్యాయని, ఆ భూముల్లోనే వారి ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో హరీష్‌రావు ఫామ్‌హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. దానికి వెళ్లేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బాలానగర్‌లో 120 ఎకరాలను హరీష్ కుటుంబ సభ్యులు కొల్లగొట్టారని, వారి భయంతో బాధితులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రాలేకపోతున్నారని చెప్పారు.
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల వివరాలు – రేవంత్ విడుదల చేసిన లెక్కలివే..
  • కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో: 295 ఎకరాలు
  • సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబం పేరున: 67.5 ఎకరాలు
  • కల్వకుంట్ల కవిత కుటుంబం: మొత్తం 37 ఎకరాలు (కవిత పేరు మీద 44 ఎకరాలు, ఆమె భర్త అనిల్ కుమార్ పేరిట 23 ఎకరాలు ఉన్నాయని మరో ప్రస్తావన)
  • హరీష్‌రావు కుటుంబం: 30 ఎకరాలు
  • జోగినపల్లి సంతోష్ రావు కుటుంబం: 79 ఎకరాలు
  • నవీన్‌రావు: 52 ఎకరాలు
  • కొండల్‌రావు: 48 ఎకరాలు

కేటీఆర్ కుటుంబంలో 123 ఎకరాల లెక్క..

కేటీఆర్ కుటుంబంలోని నలుగురి పేర్ల మీద మొత్తం 123 ఎకరాలు ఉన్నట్లు సీఎం రేవంత్ వివరాలు వెల్లడించారు..
  • కేటీఆర్ (KTR): 49.5 ఎకరాలు
  • శైలిమ (భార్య): 17.5 ఎకరాలు
  • హిమాన్ష్ (కుమారుడు): 46.3 ఎకరాలు
  • అలేఖ్య (కుమార్తె): 9.38 ఎకరాలు

ఈ భూముల రిజిస్ట్రేషన్లు, కొనుగోలు మూలాలపై పక్కాగా దర్యాప్తు జరిపించి అసలు వాస్తవాలను ప్రజల ముందుంచుతామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *