IPL 2027: గత మూడేళ్లుగా విదేశీ గడ్డపై సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం ప్రక్రియ తిరిగి భారతదేశానికి రానుంది. ఐపీఎల్ 2027 సీజన్కు సంబంధించిన మినీ-వేలాన్ని భారత్లోనే నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. గతంలో దుబాయ్, జెడ్డా, అబుదాబి వేదికలుగా వేలం నిర్వహించగా, మినీ-వేలం కోసం మళ్లీ స్వదేశానికే మొగ్గు చూపారు. అయితే రాబోయే తదుపరి మెగా వేలం మాత్రం తిరిగి విదేశాల్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఫ్రాంచైజీల అసంతృప్తి – బీసీసీఐ కీలక నిర్ణయం..
కేవలం ఒకటి లేదా రెండు రోజులు జరిగే చిన్న మినీ-వేలం కోసం ఆటగాళ్ల ఎంపిక బృందం, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీ ప్రతినిధులను విదేశాలకు తరలించడం ఆర్థికంగా, నిర్వహణ పరంగా పెను భారంగా మారుతోందని ఫ్రాంచైజీలు భావించాయి.
అబుదాబిలో జరిగిన గత వేలం సమయంలో ఫ్రాంచైజీ యజమానులు ఎదుర్కొన్న ఇబ్బందులను బీసీసీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు, ఈసారి స్వదేశంలోనే వేలం నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది.
వేదిక ఎంపికకు పెళ్లిళ్ల సీజన్, హోటల్ గదుల కొరత సవాలు..
వేలాన్ని భారతదేశంలో ఏ నగరంలో నిర్వహించాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య దేశవ్యాప్తంగా వివాహాల సీజన్ పీక్స్లో ఉండటంతో ప్రముఖ నగరాల్లోని 5-స్టార్ హోటళ్లలో గదుల కొరత తీవ్రంగా ఉంటుంది. రెండు రోజుల ఈ ఈవెంట్ కోసం ఫ్రాంచైజీలు, బీసీసీఐ పెద్దలు, బ్రాడ్కాస్టర్లు, మీడియా ప్రతినిధుల కోసం కనీసం 100 ప్రీమియం గదులు అవసరమవుతాయి. ఈ లాజిస్టిక్స్ సదుపాయం పూర్తిస్థాయిలో లభించే నగరంలోనే వేలం వేదికను ఖరారు చేయనున్నారు.
ఆల్రౌండర్ల భవిష్యత్తుపై ఆందోళన..
ఎంతో వివాదాస్పదమైన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ రూల్ వల్ల భారత క్రికెట్లో ఆల్రౌండర్ల అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు సీనియర్ ఆటగాళ్లు, కొన్ని ఫ్రాంచైజీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.
జట్టు సమతుల్యత దెబ్బతింటుందన్న వాదన..
మరోవైపు, గత మెగా వేలంలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను దృష్టిలో ఉంచుకునే జట్లను నిర్మించుకున్నామని, ఇప్పుడు హఠాత్తుగా తొలగిస్తే టీమ్ కాంబినేషన్ దెబ్బతింటుందని మరికొన్ని జట్లు వాదిస్తున్నాయి. తదుపరి మెగా వేలం వరకైనా ఈ నిబంధనను కొనసాగించాలని కోరుతున్నాయి. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు వచ్చే నెలలో బీసీసీఐ ఫ్రాంచైజీలతో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
