Chandrababu: తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ (TDP) వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు ఒక సంచలన మరియు కీలక ప్రకటన చేశారు.
“యుగపురుషుడు ఎన్టీఆర్ గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ఇవ్వాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ఎన్టీఆర్ను సత్కరించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవం. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు.. ఆయన ప్రతి తెలుగువాడి ‘తెలుగుజాతి సెంటిమెంట్'” అని చంద్రబాబు కొనియాడారు.
9 నెలల్లోనే సీఎం.. జాతీయ రాజకీయాల్లో చక్రం!
ఎన్టీఆర్ సాధించిన రాజకీయ రికార్డులను, తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఒక సాధారణ ఉద్యోగిగా తన జీవితాన్నిమొదలుపెట్టి.. ఆ తర్వాత తన స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ‘సినిమా స్టార్’గా ఎదిగిన మహానుభావుడు ఎన్టీఆర్. ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించి, పార్టీ పెట్టిన కేవలం 9 నెలల స్వల్ప వ్యవధిలోనే ముఖ్యమంత్రి (CM) గా ఎదగడం ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది.
కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ గారి నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లోనూ అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని చంద్రబాబు పేర్కొన్నారు.
పేదలకు భరోసా.. రైతులకు నేస్తం!
ఎన్టీఆర్ పాలన, ఆయన ఆశయాల గురించి చంద్రబాబు నాయుడు భావోద్వేగంగా మాట్లాడారు. “ఎన్టీఆర్ అంటే పేద ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా. అలాగే రైతులకు ఆయన ఎల్లప్పుడూ ఒక నిజమైన నేస్తంలా అండగా నిలిచారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సమానంగా ప్రేమించే ఏకైక ప్రజా నాయకుడు ఆయన. తన జీవితంలో ఎంతటి కష్టాలు ఎదురైనా.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎన్టీఆర్ గారు ఎప్పుడూ వీడలేదు” అని స్పష్టం చేశారు.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు!
ఎన్టీఆర్ గారు నమ్మిన సిద్ధాంతమే నేటికీ తెలుగుదేశం పార్టీని నడిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. “సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అనేదే ఎన్టీఆర్ గారి ఏకైక సిద్ధాంతమని, ఆ ఆశయాలకు కట్టుబడే తమ ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమం, ప్రగతి కోసం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు.
