Harish Rao

Harish Rao: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

Harish Rao: తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ‘ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నాయకుడు హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫార్మాసిటీ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

కేంద్ర పర్యావరణ శాఖ కేవలం ‘ఫార్మాసిటీ’కి మాత్రమే అనుమతులు ఇచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. చట్టం ప్రకారం ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూములను వేరే పనులకు వాడకూడదని, ఒకవేళ అలా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇచ్చేయాలని చట్టంలో ఉందని ఆయన వివరించారు. కోర్టులో విచారణ జరిగినప్పుడు తాము ఫార్మాసిటీని కొనసాగిస్తున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. బయట మాత్రం ఫ్యూచర్ సిటీ అంటూ కొత్త డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 75 శాతం ఫార్మా రంగానికి, మిగిలిన 25 శాతం ఇతర అవసరాలకు కేటాయించాలని ప్రణాళికలు వేశామని చెప్పారు. కానీ, ఈ ప్రభుత్వం దానికి పూర్తి భిన్నంగా 75 శాతం వ్యాపారానికి వాడుకుంటూ, కేవలం 25 శాతం మాత్రమే ఫార్మాకు ఉంచుతోందని విమర్శించారు. ఫార్మాసిటీ గనుక వస్తే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే తాము ఆ ప్రాజెక్టును మొదలుపెట్టామని ఆయన అన్నారు.

తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని పాత పద్ధతిలోనే పునరుద్ధరిస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఏం చేసినా అది సాగదని, కోర్టుల ముందు నిలబడదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా నుంచి హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *