Chandrababu Naidu

Chandrababu Naidu: తిరుపతి గంగమ్మ కు బాబు పట్టు వస్త్రాలు..!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. బుధవారం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి కుప్పంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలికారు. గంగమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గంగమ్మ జాతరలో సీఎం దంపతుల ప్రత్యేక పూజలు

కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం ప్రత్యేకంగా విచ్చేసిన చంద్రబాబు, భువనేశ్వరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు సీఎం దంపతులకు ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో, జై బాబు నినాదాలతో మార్మోగాయి.

నియోజకవర్గ అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్

అమ్మవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. పెండింగ్ లో ఉన్న స్థానిక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *