Parthasarathy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జరుగుతున్న అభివృద్ధిని చూసి ఐదు కోట్ల ప్రజలు హర్షిస్తుంటే, వైకాపా నేతలు మాత్రం దానిని ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైకాపా హయాంలో కుంటుపడిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహోరాత్రులు శ్రమిస్తున్నారని తెలిపారు. గతంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయిన పరిస్థితి నుంచి, నేడు ఏపీకి తిరిగి ‘బ్రాండ్ వాల్యూ’ వచ్చిందని, గడిచిన 20 నెలల కాలంలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా వాటి ఏర్పాటు పనులు కూడా మొదలయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని విషయంలో వైకాపా అధినేత జగన్ అనుసరిస్తున్న తీరుపై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్, 2019 ఎన్నికల ముందు అక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల కాలయాపన చేసి, అమరావతిని ఎడారిగా, శ్మశానంగా అభివర్ణించడం ప్రజలకు చేసిన తీవ్ర నమ్మక ద్రోహం అని ఆక్షేపించారు. నదీ తీరాన రాజధాని ఎందుకు అని ప్రశ్నించే జగన్కు.. లండన్, వాషింగ్టన్, కైరో వంటి అంతర్జాతీయ నగరాలన్నీ నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయన్న కనీస అవగాహన లేకపోవడం ఆశ్చర్యకరమని ఎద్దేవా చేశారు.
Also Read: Vande Bharat Sleeper: రైల్వే చరిత్రలో కొత్త మైలురాయి.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ (ADB), నాబార్డ్ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి వేల కోట్ల నిధులు సమీకరించి అమరావతి పనులను వేగవంతం చేసిందని మంత్రి వివరించారు. ఒకప్పుడు సైబరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన చంద్రబాబు, ఇప్పుడు అమరావతిని ‘క్వాంటం వ్యాలీ’గా (Quantum Valley) తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, దీని ద్వారా వచ్చే ఆదాయంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల వైకాపాకు ఏమాత్రం గౌరవం లేదని పార్థసారథి విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను, మహిళలను పోలీసులతో హింసించిన జగన్ ప్రభుత్వానికి, 2024 ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లతోనే సరిపెట్టి సరైన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికైనా అమరావతిపై విషం చిమ్మడం మానేసి, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే వైకాపా నేతలు అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఆయన సవాల్ విసిరారు. పర్యావరణానికి హాని కలగకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
