Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్ కొద్ది రోజుల క్రితం ముంబై టీమ్ను వీడి గోవా టీమ్కు ఆడాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నాడు. గోవా క్రికెట్ అసోసియేషన్ తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తానని చెప్పిందని.. అందుకే ముంబైని వీడినట్లు అప్పట్లో జైస్వాల్ తెలిపాడు.
ఇప్పుడు ఈ విషయంలో జైస్వాల్ యూ టర్న్ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్ చేశాడు. వారు జారీ చేసిన ఎన్వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెప్పాడు. ఈ దేశవాలీ సీజన్లో సెలెక్షన్కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని రిక్వెస్ట్ చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ అసోసియేషన్కు కాని సమర్పించలేదని తెలిపాడు. దీనిపై ఎంసీఏ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కాగా ఉత్తర్ప్రదేశ్లో పుట్టిన జైస్వాల్.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. ఏదిఏమైన జైస్వాల్ చివరకు మంచి నిర్ణయం తీసుకున్నాడని అతడి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.