VijayasaiReddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో వైసీపీ తటస్థ వైఖరిని కొనసాగిస్తుందని చెప్పారు, ఇండియా కూటమి ఎన్డీయే కూటముల మధ్య సమదూరం ఉంచుతామని పేర్కొన్నారు. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ చేపట్టిన “పోరుబాట” కార్యక్రమానికి విశాఖపట్నంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ మొదటి నుంచీ న్యూట్రల్గా ఉందని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ ముందుగానే చెబుతూ వస్తోందని గుర్తుచేశారు.
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి, అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 15 వేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపించారు. వచ్చే నెల నుంచి విద్యుత్ యూనిట్పై రూపాయిన్నర వరకు అదనపు భారం పడుతుందని తెలిపారు.
అదేవిధంగా, నాణ్యమైన విద్యుత్, విద్య, వైద్య సేవలను అందిస్తామని చెప్పి, నాణ్యమైన మద్యం అందిస్తున్నారని విమర్శించారు.