Viral News: 

Viral News: గణనాథుడి కళ్ల నుంచి కన్నీళ్లు.. ఉజ్జయిని ఆలయంలో వింత ఘటన..!

Viral News: దేశవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన వేళ.. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని జిల్లాలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక ఆలయంలో కొలువైన శ్రీ గణేశుడి ప్రతిమ కళ్ల నుంచి వరుసగా నీటి బిందువులు (కన్నీళ్లు) కారడం స్థానికులను, భక్తులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింత దృశ్యాలను కళ్లారా చూసేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

ఉదయం 6:30 గంటల నుంచి మొదలైన ఉదంతం..

ఉజ్జయిని జిల్లా తాజాపూర్ తహసీల్ పరిధిలోని ‘మాతాజీకి బావడీ’ వద్ద ఉన్న పురాతన గణపతి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో ఆలయంలో పూజలు చేస్తుండగా, వినాయకుడి విగ్రహం కళ్ల నుంచి నిరంతరాయంగా నీరు కారడం స్థానికులు గమనించారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు.
కన్నీళ్లకు కారణం ఏంటి? – గ్రామస్తుల భావన..
గ్రామస్తులు, స్థానికుల కథనం ప్రకారం ఈ పరిణామానికి ప్రధాన కారణం ఆచార లోపమేనని నమ్ముతున్నారు..ఇటీవల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నగర పూజ’ సందర్భంగా గణనాథుడికి సాంప్రదాయబద్ధంగా సమర్పించాల్సిన ‘చోలా’ (సింధూర అలంకరణ) పూజను నిర్వహించలేదు. ఆచార సంప్రదాయం ప్రకారం పూజ జరగకపోవడం వల్లే గణపతి తీవ్ర అసంతృప్తికి గురై ఇలా కన్నీళ్లు పెట్టుకున్నారని స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు.
క్షమాపణలు.. ప్రత్యేక మహా హారతి & పూజలు:
వినాయకుడి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు గ్రామస్తులు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టారు:ఆలయంలో వినాయకుడికి క్షమాపణలు చెబుతూ ప్రత్యేక మహా హారతి నిర్వహించారు.రోజంతా భజనలు, కీర్తనలు, మంత్ర జపాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.అనంతరం శాస్త్రోక్తంగా గణపతికి సింధూరంతో కూడిన ‘చోలా’ను సమర్పించారు. ఆ పూజ పూర్తయిన తర్వాత విగ్రహం కళ్ల నుంచి వచ్చే కన్నీటి చుక్కలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని స్థానికులు తెలిపారు. ఈ వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *