Kantara 2: రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘కాంతారా: చాప్టర్ 1’ సెట్లో విషాదం చోటుచేసుకుంది. కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎం.ఎఫ్. కపిల్ (33) కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. లంచ్ బ్రేక్ తర్వాత నదిలో ఈత కోసం దిగిన కపిల్, బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, సాయంత్రానికి కపిల్ మృతదేహం లభ్యమైంది. కొల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదంతో చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఇది ‘కాంతారా 2’ సెట్లో మొదటి ప్రమాదం కాదు. గతంలో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న బస్సు బోల్తాపడిన సంఘటన జరిగింది. అలాగే, భారీగా నిర్మించిన సెట్ గాలి, వర్షానికి ధ్వంసమైంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, కదంబ రాజవంశ కాలంలో సాగే కథతో అక్టోబర్ 2న విడుదల కానుంది. కపిల్ మృతిపై సినీ కార్మిక సంఘం (AICWA) స్పందిస్తూ, నిష్పక్షపాత దర్యాప్తు, రూ.1 కోటి పరిహారం డిమాండ్ చేసింది. ఈ ఘటనతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.