AE Nukaraju Case: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ తిల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రైఫిల్ షూటింగ్ ట్రైనర్ షేక్ సాధిక్ ఖాన్ పెట్టిన మానసిక, శారీరక, ఆర్థిక చిత్రహింసల వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు నిర్ధారించగా.. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఈ విషాదంలో ప్రాణాలతో బయటపడిన పదేళ్ల బాలుడు కార్తికేయరెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో, ఇంటి వద్ద ఉన్న స్కూటర్ డిక్కీలో నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సౌజన్య లేఖలో కన్నీటి వాస్తవాలు.. భర్తను విషమిచ్చి చంపాడు.. మత మార్పిడికి ఒత్తిడి చేశాడు!
సౌజన్య రాసిన లేఖలో సాధిక్ ఖాన్ రాక్షస కృత్యాల గురించి పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం.
-
విషమిచ్చి అల్లుడి హత్య: జూలై 2న తన భర్త జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో చనిపోలేదని, సాధిక్ ఖానే ఏదో విష పదార్థం ఇచ్చి పక్కా ప్లాన్తో హత్య చేశాడని సౌజన్య లేఖలో తీవ్ర ఆరోపణలు చేసింది.
-
బ్లాక్మెయిలింగ్ & ఆస్తుల దోపిడీ: ప్రైవేట్ ఫొటోలు అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ తమ బంగారం, నగదు, బ్యాంకు ఏటీఎం కార్డులు, ఆస్తులన్నింటినీ బలవంతంగా లాక్కున్నాడని పేర్కొంది.
-
హత్య బెదిరింపులు & మత మార్పిడి: తన మాట వినకుంటే తండ్రి నూకరాజుతో పాటు కుటుంబం మొత్తాన్ని మట్టుబెడతానని బెదిరించాడని, అంతేకాకుండా ఇస్లాంలోకి మారాలంటూ నిరంతరం తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాడని ఆరోపించింది.
ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్కు – వాట్సాప్ చాట్ల విశ్లేషణ:
గోదావరిలోకి దూకడానికి ముందు నూకరాజు తన ఫోన్లు, పర్సును కారులోనే వదిలివెళ్లారు. అయితే, ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు అందులోని వాట్సాప్ మెసేజ్లన్నీ డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు..
-
ఫోరెన్సిక్ విశ్లేషణ: సౌజన్య, నూకరాజు సెల్ఫోన్లను పూర్తి సాంకేతిక విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు (FSL) పంపాలని నిర్ణయించారు. డిలీట్ అయిన చాట్స్, కాల్ డేటా రీట్రీవ్ అయితే సాధిక్ సాగించిన బ్లాక్మెయిలింగ్ నెట్వర్క్ గుట్టు రట్టవుతుందని భావిస్తున్నారు.
-
జగదీశ్వరరెడ్డి మృతిపై కేసు: సౌజన్య లేఖ ఆధారంగా జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో సర్పవరం పీఎస్లో సాధిక్పై హత్యాయత్నం సహా మరో ఐదు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
పరారీలో నిందితుడు – 5 ప్రత్యేక బృందాలతో గాలింపు:
ఈ దారుణం వెలుగుచూడగానే నిందితుడు సాధిక్ ఖాన్ తన ఫోన్ను ఇంట్లోనే పడేసి కాకినాడ నుంచి పరారయ్యాడు. రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులకు, ఓ లాయర్కు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి 5 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
మరోవైపు సాధిక్ గతంలో నడిపిన షూటింగ్ అకాడమీలోనూ మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
గతంలో రోడ్డు ప్రమాదంలో కుమారుడిని, ఇటీవల అల్లుడిని కోల్పోయిన ఆ కుటుంబం.. ఇప్పుడు ఈ కిరాతకుడి వేధింపులకు బలవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నదిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
