tpcc-chief-mahesh-kumar-goud-chitchat-no-cabinet-expansion-konda-surekha-dismissal-aicc-decision

Mahesh Kumar Goud:  22ఏ పాపం కాంగ్రెస్‌ది కాదు.. కొండా సురేఖ అంశం ముగిసిన అధ్యాయం

Mahesh Kumar Goud: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22ఏ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఏఐసీసీ అగ్రనేతలతో భేటీకి ముందు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో భారీ ఎత్తున భూదోపిడీ జరిగిందని, ఆ పాపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో జరిగిన భూదోపిడీపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలా వద్దా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని తేల్చిచెప్పారు.

నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ – పార్టీ బలోపేతం:

రాష్ట్రంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేస్తూ రాబోయే నెల రోజుల్లోనే అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.త్వరలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి పూర్తి స్థాయి జంబో కార్యవర్గాన్ని నియమించడంతో పాటు జిల్లాల వారీగా డీసీసీ (DCC) అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామన్నారు. తన పీసీసీ అధ్యక్ష పదవీకాలానికి ఇంకా ఏడాది సమయం మిగిలి ఉందని, మంత్రివర్గ విస్తరణ చేపట్టాలా వద్దా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచక్షణపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
కొండా సురేఖ అంశం ముగిసిన అధ్యాయం
మంత్రి కొండా సురేఖ చుట్టూ గత కొద్దిరోజులుగా నడుస్తున్న వివాదంపై స్పందిస్తూ.. అది పూర్తిగా ముగిసిన అధ్యాయమని మహేష్‌గౌడ్ స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పనుల వివరాలను ఏఐసీసీ అధిష్ఠానానికి నివేదిస్తానని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *