KCR: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘ కాలంగా దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తాజాగా భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిట్ అధికారులు గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫామ్హౌస్కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయనకు అధికారికంగా నోటీసులు అందజేసి, రేపు అక్కడే ఆయనను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులతో పాటు సుమారు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఈ కేసులో ప్రధానాంశంగా ఉన్నాయి. ఈ కుట్ర కోణాన్ని ఛేదించే క్రమంలో సిట్ అధికారులు ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలైన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావులను గంటల తరబడి విచారించారు. అలాగే రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావును కూడా విచారణకు పిలిపించి వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా అరెస్టయిన పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు, సాంకేతిక ఆధారాల ఆధారంగా మాజీ సీఎంను కూడా ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది.
