Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. నవంబర్ 25న రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానున్నది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు, ఇతర అంశాలపై కీలకంగా చర్చ జరగనున్నది. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆ మరునాడే అంటే నవంబర్ 26వ తేదీన స్థానిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం జారీ చేయనున్నది.
Telangana Cabinet: డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు 50 శాతం లోపు రిజర్వేషన్లను పాటిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేయనున్నది. వార్డులు, పంచాయతీల ఆధారంగా బీసీలు 27, ఎస్సీలు 15 నుంచి 16 శాతం, ఎస్టీలు 6 నుంచి 10 శాతం మేరకు రిజర్వేషన్లకు సిఫారసు చేయనున్నది. దీంతో మొత్తంగా 50శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 42 శాతం కోటా అంశంలో ఎదురైన సవాళ్లను క్యాబినెట్ మీడియా ముందు వివరించనున్నది.
Telangana Cabinet: ఈ మేరకు డిసెంబర్ 20వ తేదీలోపు 12,733 గ్రామ పంచాయతీలకు, 1,12,288 వార్డు స్థానాలకు గాను పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేయనున్నది. ఆ తర్వాత కోర్టులో 42 శాతం బీసీ కోటా తేలాక పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు వెళ్లాలనే భావనతో సర్కారు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు న్యాయస్థానం గ్రీన్సిగ్నల్ ఇస్తే ఆ మేరకు ఎన్నికలను నిర్వహించనున్నది. లేదంటే పంచాయతీ ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంటుంది.
Telangana Cabinet: నవంబర్ 25న జరిగే తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో మరో కీలక అంశంపై చర్చించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఈ ఫార్ములా కార్ రేస్ కేసు విషయంలో కేటీఆర్ను విచారించే అంశంపైనా క్యాబినెట్ చర్చించనున్నది. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది.
Telangana Cabinet: డీఐబీ కుంభకోణం, ఇతర కేసుల్లో కూడా కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరే విషయంపైనా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు, గిగ్వర్కర్స్ బిల్లు సవరణలు, తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2025 నిర్వహణ అంశాలపైనా క్యాబినెట్ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.
