Telangana Cabinet:తెలంగాణ మంత్రివర్గం నుంచి నలుగురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మునపటి నుంచి మంత్రుల పనితీరు, ఇతర ఆరోపణలను ఆసరా చేసుకొని ఒకరిద్దరి తొలగింపు ఉంటుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి ఆ సంఖ్య నలుగురికి చేరినట్టు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నది.
Telangana Cabinet:జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు, పార్టీ అంతర్గత రాజకీయాలు, మంత్రుల పనితీరు, వివాదాస్పద వ్యాఖ్యల వంటివి మంత్రుల ఉద్వాసనకు కారణాలుగా భావించవచ్చు. వీరి స్థానంలో నలుగురితోపాటు మరో ఇద్దరిని అదనంగా పూర్తిస్థాయి మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
Telangana Cabinet:ప్రధానంగా కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభావకర్ పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. వీరితోపాటు సీనియర్ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కూడా ఉద్వాసన తప్పదని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి దక్కాలంటే వెంకట్రెడ్డికి ఉద్వాసన తప్పదని చెప్తున్నారు. దీంతో ఈ నలుగురిని మార్చేందుకే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం.
Telangana Cabinet:ఇదే సమయంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు మంత్రి పదవి తప్పక దక్కుతుందని వార్తలు వస్తున్నాయి. ఆయనతోపాటు ఆది శ్రీనివాస్, విజయశాంతి, మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరో ఇద్దరికి అవకాశం దక్కే అవకాశం ఉన్నదని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడుసార్లు మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకోగా, ఈ సారి భారీ మార్పులు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Telangana Cabinet:ఈ భారీ మంత్రివర్గ మార్పులు డిసెంబర్ నెల తొలివారంలోపే జరుగుతాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గంలో కీలక మార్పులు చేయబోతున్నారని ప్రచారం కూడా జరుగుతున్నది. పాలనను మెరుగు పర్చడానికి, సామాజిక వర్గాల సమతూకం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
