delhi: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పంజాబ్, జమ్మూకశ్మీర్లలో విద్యనభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఆందోళనతో తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ డ్రోన్లతో దాడులు జరుగుతున్న నేపథ్యంలో, విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు విద్యార్థులను తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టాయి.
నిన్న రాత్రి పంజాబ్లోని పలు ప్రాంతాల్లో బ్లాక్-అవుట్ విధించడం, అమృత్సర్, జలంధర్ వంటి సున్నితమైన ప్రదేశాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో విద్యార్థుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో చదువుకుంటున్న సుమారు 70 మంది తెలుగు విద్యార్థులు ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ యూనివర్సిటీలో దాదాపు రెండు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు మాట్లాడుతూ, గత రెండు రోజులుగా తమ యూనివర్సిటీ మీదుగా పాక్ డ్రోన్లు వెళ్లాయని, వాటిని భారత బలగాలు అడ్డుకున్నాయని తెలిపారు. డ్రోన్ల సంచారాన్ని గమనించిన యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థుల భద్రత దృష్ట్యా తక్షణమే హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించినట్లు వివరించారు.
తెలుగు విద్యార్థులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాయి. ఢిల్లీని కేంద్రంగా తీసుకుని, ఏపీ భవన్, తెలంగాణ భవన్లలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, టోల్ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచారు. ఈ నెంబర్లకు పంజాబ్, జమ్ముకశ్మీర్లలోని విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా విద్యార్థులను ముందుగా ఢిల్లీకి తరలించి, అక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.