Pakistan: భారత్ పై దాడుల్లో పాకిస్థాన్ వినియోగిస్తున్న చైనా తయారీ ఆయుధాల నాణ్యతపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల సందర్భంగా, పాక్ ఉపయోగించిన చైనా డ్రోన్లు, క్షిపణులు పలు మార్లు లక్ష్యాలను చేరడంలో విఫలమైనట్లు ఆయన తెలిపారు. ఈ విషయాలు పరిశీలనలో ఉండగా, చైనా తక్కువ నాణ్యత కలిగిన ఆయుధాలను ఉద్దేశపూర్వకంగా పాకిస్థాన్కు సరఫరా చేస్తోందన్న అనుమానం వ్యక్తమవుతోంది.
భారత భూభాగంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించిన తర్వాత, అవి సాంకేతికంగా విఫలమవడమే కాకుండా, తయారీ పరంగా నాణ్యత లోపాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా చైనా ఆయుధ సరఫరాదారుగా ఎదగాలన్న లక్ష్యంతో, పాక్ వంటి దేశాలకు తక్కువ శ్రేణి ఆయుధాలు అమ్మకాలు చేస్తున్నట్టుగా గతంలో వచ్చిన ఆరోపణలు ఈ సందర్భంగా మరలా వినిపిస్తున్నాయి. ఈ ఆయుధాల పనితీరు పాకిస్థాన్ సైనిక సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశముందని ఆయన పరోక్షంగా సూచించారు.