Nagar Kurnool

Nagar Kurnool: నిందితుడిని వదిలేసి, బాధితులను బూతులు తిట్టిన ఎస్సై..

Nagar Kurnool: నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీనివాస్ వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన అధికారి, పోలీస్ స్టేషన్‌లోనే యువకులపై బూతు పురాణంతో విరుచుకుపడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక రోడ్డు ప్రమాదం విషయంలో బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు, నిందితుడికి కొమ్ముకాస్తున్నారని ప్రశ్నించినందుకు ఎస్సై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.

అసలు ఏం జరిగిందంటే.. వెలుగొండ గేటు సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఒక కారు డ్రైవర్ ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్‌ను స్థానిక యువకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కారు డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని గుర్తించి, అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. నిందితుడికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించి కేసు నమోదు చేయాలని అక్కడి రైటర్‌ను యువకులు కోరారు. అయితే, పోలీసులు నిందితుడి ని పరీక్ష చేయకుండానే అతడిని పంపించివేయడానికి ప్రయత్నించారు.

ఇది కూడా చదవండి: ED: శబరిమల బంగారం చోరీ కేసు.. 3 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

ఈ విషయాన్ని యువకులు నిలదీయడంతో, నిద్రలో ఉన్న ఎస్సై శ్రీనివాస్ కేవలం షార్ట్, బనియన్ మీద అక్కడికి చేరుకున్నారు. తనను ప్రశ్నిస్తారా అన్న అహంకారంతో యువకులపై దాడికి దిగారు. “లం* కొడకల్లారా.. లంబడి కొడకల్లారా..” అంటూ అత్యంత దారుణమైన బూతులు తిడుతూ కులపరమైన దూషణలకు పాల్పడ్డారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన అధికారి, ఇలా వీధి రౌడీలా ప్రవర్తించడం చూసి స్థానికులు విస్తుపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, కుల వివక్షతో బూతులు తిట్టిన ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతుంటే, ఇలాంటి ఘటనలు పోలీసుల ప్రతిష్టను మంటగలుపుతున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *