Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల విలువైన భూములు, భవనాలను ప్రభుత్వం ‘శత్రు ఆస్తులు’గా గుర్తించింది. దీన్ని సైఫ్ కుటుంబం వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కానీ, కోర్టు మాత్రం సైఫ్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఆ ఆస్తుల భవిష్యత్తుపై భారీ సందిగ్ధత నెలకొంది.
ఆస్తుల కథ ఎంటంటే..
సైఫ్ కుటుంబానికి చెందిన ఈ ఆస్తులు భోపాల్లో ఉన్నాయి. సైఫ్ తాతమ్మ సాజిదా సుల్తాన్కి వీటిని తండ్రి నుంచి వారసత్వంగా లభించాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్ వెళ్లిపోయారు. చిన్న కుమార్తె సాజిదా మాత్రం భారతదేశంలోనే ఉండిపోయారు. ఆమె తన వారసుడిగా పటౌడీ నవాబు ఇఫ్తిఖార్ అలీ ఖాన్ను వివాహం చేసుకున్నారు.
ఎందుకు ‘శత్రు ఆస్తి’ అంటున్నారు?
అబీదా సుల్తాన్ పాకిస్తాన్కి వెళ్లిపోవడంతో ఆస్తులపై చట్టసమ్మత హక్కు ఆమెకే ఉందని ప్రభుత్వం చెబుతోంది. పాకిస్తాన్ వెళ్లినవారి ఆస్తులను ‘శత్రు ఆస్తులు’గా గుర్తించే చట్టం ఉంది. అందుకే ఈ ఆస్తులన్నీ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయని 2015లో అధికారుల ప్రకటన వచ్చింది.
ఇది కూడా చదవండి: Karuppu: సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. కరుప్పు టీజర్ రిలీజ్కు సిద్ధం?
సైఫ్ వాదన ఏమిటంటే..
సైఫ్ కుటుంబం మాత్రం ఇది సరైంది కాదని చెబుతోంది. ‘‘అబీదా సుల్తాన్ పాకిస్తాన్కి వెళ్లిన తర్వాతే తండ్రి హమీదుల్లా ఖాన్ మరణించారు. అప్పటికే భారత ప్రభుత్వం కూడా సాజిదా సుల్తాన్కే ఈ ఆస్తులు హక్కుగా ఉన్నాయి అని 1962లో ఆమోదించింది. అందువల్ల మా కుటుంబానికే ఈ ఆస్తులపై హక్కు ఉంటుంది’’ అని సైఫ్ కుటుంబం తరఫున లాయర్ వాదించారు.
హైకోర్టు తాజా తీర్పు ఏమిటంటే..
హైకోర్టు మాత్రం ‘ఈ ఆస్తులు శత్రు ఆస్తులే’ అని తేల్చేసింది. పాత ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసింది. అయితే, కేసును పూర్తిగా మళ్లీ విచారించాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఏడాదిలోగా ఈ కేసు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఇక నుంచి జరగబోయేది..
ఈ తీర్పుతో సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా, సబా—అని కలిసి రూ.15 వేల కోట్ల ఆస్తిపై తమ హక్కును కోల్పోయారు. కానీ, ట్రయల్ కోర్టులో వచ్చే నిర్ణయమే తుది. మరి భవిష్యత్తులో ఈ ఆస్తులు సైఫ్ కుటుంబానికి దక్కుతాయా? లేక ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది.