Revanth Reddy: హైదరాబాద్ పాతబస్తీ వాసులకు దశాబ్దాలుగా చుట్టుముట్టిన ట్రాఫిక్ ఇబ్బందులకు ఉపశమనం లభించింది. చంచల్గూడ నుంచి సంతోష్నగర్ వరకు నిర్మించిన నూతన స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించి నగరవాసులకు అంకితం చేశారు. అనంతరం చంచల్గూడ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో పాతబస్తీ నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది వాహనదారులకు సురక్షితమైన, సిగ్నల్ రహిత ప్రయాణం సాధ్యం కానుంది.
ఫ్లైఓవర్ ప్రాజెక్టు ముఖ్యాంశాలు..
దాదాపు రూ.620 కోట్ల అంచనా వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవు, 16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఇందులో భూసేకరణ కోసమే ప్రత్యేకంగా రూ.153.37 కోట్లు వెచ్చించారు. భూసేకరణ ప్రక్రియ, కొవిడ్ సంక్షోభం, ఇతర సాంకేతిక కారణాల వల్ల దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ప్రధానంగా లబ్ధి పొందే ప్రాంతాలు..
చంచల్గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్నగర్ యాదగిరి థియేటర్ వరకు విస్తరించిన ఈ మార్గం వల్ల ప్రధాన జంక్షన్లలో రద్దీ గణనీయంగా తగ్గనుంది.
-
సైదాబాద్
-
సంతోష్నగర్
-
చంచల్గూడ
-
ఐఎస్ సదన్
-
చంపాపేట్
-
కంచన్బాగ్
-
మలక్పేట్
నిత్యం లక్షన్నరకు పైగా వాహనాలు రాకపోకలు సాగించే ఈ కారిడార్లో ప్రయాణ సమయం ఆదా కానుంది.
హైదరాబాద్లో మూడో అతిపెద్ద ఫ్లైఓవర్గా గుర్తింపు..
ఈ నూతన వంతెన హైదరాబాద్ నగరంలోనే మూడో అతిపెద్ద ఫ్లైఓవర్గా చరిత్రకెక్కింది..
-
పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే (11.66 కి.మీ):2009లో శంషాబాద్ ఎయిర్పోర్టు కనెక్టివిటీ కోసం ప్రారంభించిన ఈ ఎలివేటెడ్ కారిడార్ దేశంలోనే అతి పొడవైన వంతెనల్లో ఒకటిగా ప్రథమ స్థానంలో ఉంది.
-
ఆరాంఘర్ ఫ్లైఓవర్ (4.08 కి.మీ):గతేడాది ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
-
సైదాబాద్–సంతోష్నగర్ ఫ్లైఓవర్ (3.2 కి.మీ):ప్రస్తుతం ప్రారంభమైన ఈ స్టీల్ బ్రిడ్జి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
-
కొత్తగూడ ఫ్లైఓవర్ (2.21 కి.మీ):గచ్చిబౌలి ప్రాంతంలోని కొత్తగూడ ఫ్లైఓవర్ నాలుగో స్థానానికి చేరింది.
