Rythu Bharosa: సంక్షేమ పథకాల అమలు కోసం రేవంత్ సర్కార్ భారీ మొత్తంలో రుణ సేకరణకు ప్లాన్ చేసింది.
రుణ రూపంలో సేకరించిన నిధులు జాగ్రత్తగా ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందట ముందుగా రైతు భరోసా హామీ నెరవేర్చాలని నిర్ణయంతో అందుకు తగ్గట్లు నిబంధనలు పాటిస్తూ స్కీం అమలుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా రైతు భరోసా ఏడు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఐటీ, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అమ లు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిదీ ఒకే లెక్కన కట్టి కుటుంబం యూనిట్ లాగా తీసుకుని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 30న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతుభరోసా విధివిధానాలకు ఆమోద ముద్ర వేయనున్న ట్లు తెలిసింది.
Rythu Bharosa: ఇదే సమయంలో వ్యవసాయ భూమి లేకుండా..కేవలం కూలి పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1.16 కోట్లు అని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న మొత్తం రైతులు 70 లక్షలని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేనట్లే లెక్క. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు ‘జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డు’ను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులన్నా ఉండవచ్చని ప్రాథమిక అంచనా…వీరికి 6వేల రూపాయల చొప్పున నగదు బదిలీకి దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ అవసరమని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాలివి. అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఖరారు చేస్తుందన్నది కసరత్తు పూర్తయితే కానీ స్పష్టత రాదు.
Rythu Bharosa: ఈ పథకం కింద ఒక్కో నిరుపేద కూలి కుటుంబానికి ఏటా రూ.12 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.6 వేలను ఈ నెలలోనే విడుదల చేస్తామని ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. రైతులకు ప్రతి ఏటా రెండు విడతలుగా రూ.7500 సాయం అందించడానికి సంక్రాంతి నాటికి ఈ పథకం ప్రారంభించాలని సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీని అమలుకు సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత రైతుభరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థికశాఖ దృష్టి పెట్టనుంది. వచ్చే నెల 14న సంక్రాంతి పండగ నుంచి రైతుభరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తామని సీఎం, మంత్రులు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. దీనికి అర్హులైన రైతుల గుర్తింపునకు కొత్త మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అనర్హుల తొలగింపుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చించింది. గతంలో రైతుబంధు పథకం కింద పంట సాగుచేయని భూముల యజమానులకు 21 వేల కోట్లకు పైగా ఇచ్చారని ప్రకటించిన ప్రభుత్వం.. రైతుభరోసా పథకాన్ని వాస్తవంగా సాగుచేసే నిజమైన రైతులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
Rythu Bharosa: కొండలు, గుట్టలు, రాళ్లు ,రప్పలు,రహదారుల పేరుతో కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నందున వాటిని గుర్తించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కసరత్తులన్నీ పూర్తిచేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలంటే కనీసం 6 నుంచి 7వేల కోట్లు కావాలని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 -25) రాష్ట్ర బడ్జెట్లో రైతుభరోసా పథకానికి రూ.15 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందున నిధుల విడుదలకు సమస్యలు లేవు. కానీ ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకేసారి ఆరేడు వేల కోట్లను సమీకరించడమే అసలు సమస్య అని సమాచారం.
సంక్రాంతి నాటికి బాండ్ల విక్రయం ద్వారా మరో 4 వేల కోట్ల వరకూ రుణాలను సేకరించే అవకాశాలున్నాయి. గత వారంలో 1500 కోట్ల రుణాలను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. పన్నుల ద్వారా కూడా ఆదాయం పెంచాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. పరిశ్రమల కార్పొరేషన్ భూములు ఓ ప్రైవేట్ బ్యాంకు వద్ద తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణ సేకరణకు సిద్ధం అయింది.
Rythu Bharosa: ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతోంది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ ప్రకారం జనవరి నుంచి పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని, సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు ఇబ్బందులు ఉండకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిధుల సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, రైతుభరోసాకు ఇవ్వడానికి ఇబ్బందులేమీ ఉండవని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయానికి కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అందులో ఒకటి ఆదాయ పరిమితి. ఆదాయపన్ను చెల్లించే వ్యాపారులు, కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను పీఎం కిసాన్ సమ్మాన్నిధి నుంచి మినహాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి తీసుకురానున్న రైతుభరోసాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం.
Rythu Bharosa: సాగు చేసే నిజమైన రైతులకే సర్కార్ సాయం అందాలన్న లక్ష్యంలో భాగంగా వీరికి రైతుభరోసా తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించినట్టు తెలిసింది. ఇందులో నాలుగో తరగతి ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మినహాయించినట్టు సమాచారం. కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కుటుంబంలోని ఇతర సభ్యులు ఐటీ చెల్లింపుదారులుగా ఉంటే కోత పెట్టాలనే ఆలచనలో ఉన్నట్టు తెలిసింది.
ప్రతి గ్రామంలో భూములు ఎన్ని ఉన్నాయి? అందులో సాగు చేస్తున్నది ఎంత? అనే వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద ఉంటాయి. కానీ సాగు భూములకే పంటసాయం అందించాలనే కండిషన్ పెట్టడం వల్ల ఫీల్ట్ స్థాయిలో సాగు భూముల వివరాలను గుర్తించే సమయంలో అవినీతి చోటుచేసుకునే ప్రమాదం ఉందన్న విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం.. రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని భావిస్తోంది.
Rythu Bharosa: సర్వే నంబర్ల ఆధారంగా ఆ పంట సాగుచేశారో లేదో అని (శాటిలైట్ ద్వారా) గుర్తించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ ఒక సర్వే నంబర్లో ఎంత మంది రైతులకు పట్టా ఉన్నదనే విషయం తేల్చడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సాగు భూములను గుర్తించేందుకు శాటిలైట్ సహకారం తీసుకోవడంతో పాటు రైతులను గుర్తించేందుకు ఫీల్ట్ లెవల్ వెరిఫికేషన్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
రాసినవారు: తోట శ్రీకాంత్
సీఎంవో సెక్రటేరియట్
తెలంగాణ