PM Modi: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందెశ్రీ మరణం భారతీయ సాంస్కృతిక, మేధో ప్రపంచానికి తీరని లోటు అని ప్రధాని అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.
“అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆయన తెలంగాణ ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి గొంతుకగా నిలిచారని కొనియాడారు. అందెశ్రీ పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉందని, అవి అన్ని వర్గాల ప్రజల కోరికలను ఏకం చేసి, ప్రజల సాంఘిక హృదయ స్పందనకి ఒక రూపాన్ని ఇచ్చాయని మోడీ అన్నారు. సామాజిక స్పృహను సాహితీ సౌందర్యంతో కలిపిన ఆయన విధానం అద్వితీయం అని ప్రధాని ప్రశంసించారు.
