Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల విషయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు.
శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జూపల్లి, పాలమూరు ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అనుసరించిన విధానాలపై పదునైన విమర్శలు సంధించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే.
పాలమూరు-రంగారెడ్డిపై ‘కపట ప్రేమ’
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేసీఆర్కు ఉన్నది ప్రేమ కాదు, అది కేవలం బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకమని జూపల్లి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? అని ఆయన నిలదీశారు. కేవలం పంప్హౌస్ను ప్రారంభించి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నట్లుగా ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Rakul Preet Brother: టాలీవుడ్ డ్రగ్స్ సెగ.. డ్రగ్స్ కేసులో రకుల్ప్రీత్సింగ్ సోదరుడు పరారీ
సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్లు
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును జూపల్లి తప్పుబట్టారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాగునీటి కోసం కాదు, కేవలం తాగునీటి కోసమే అని గతంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ నీటి వాటా విషయంలో కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు.
ప్రజలు తీర్పు ఇచ్చారు.. తోలు తీశారు!
బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మా తోలు తీయడం కాదు, ఇప్పటికే ప్రజలు వరుస ఎన్నికల్లో ఆ పార్టీ తోలు తీశారు అని ఘాటుగా స్పందించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నుంచి మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. ఆ పార్టీలో ఇప్పుడు కండ లేదు, కేవలం ఎముకలే మిగిలాయి.
