Crime News

Crime News: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక మలుపు.. అర్జున్ శర్మ అరెస్ట్..!

Crime News: అమెరికాలో జరిగిన తెలుగు విద్యార్థిని నిఖిత గొడిశాల (27) దారుణ హత్య కేసులో ఎనిమిది నెలల తర్వాత కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మను పోలీసులు ఆగ్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా ప్రభుత్వం చేసిన అధికారిక అభ్యర్థన మేరకు అతడిని ఆ దేశానికి అప్పగించే (Extradition) ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

ఎట్టకేలకు నిందితుడు పట్టుబడటాన్ని నిఖిత కుటుంబ సభ్యులు స్వాగతిస్తూనే.. యూఎస్, భారత దర్యాప్తు సంస్థలు ఈ కేసు వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది?:
హైదరాబాద్ లాలాగూడ (విజయపురి కాలనీ) ప్రాంతానికి చెందిన ఆనంద్ కుమార్తె నిఖిత ఉన్నత విద్య (MS) కోసం నాలుగేళ్ల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్‌కు వెళ్లారు. ఈ ఏడాది జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మ అమెరికా పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి, వెంటనే విమానంలో భారత్‌కు పారిపోయి వచ్చాడు. అనుమానం వచ్చిన అమెరికా పోలీసులు జనవరి 3న అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో తనిఖీ చేయగా, నిఖిత మృతదేహం కత్తిపోట్లతో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. గతేడాది డిసెంబరు 31నే ఆమె హత్యకు గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

అప్పు డబ్బులు అడిగినందుకే దారుణం – తండ్రి ఆరోపణలు..

తన కుమార్తె వద్ద అర్జున్ శర్మ పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని గట్టిగా నిలదీసినందుకే ఆమెను దారుణంగా హత్య చేశాడని నిఖిత తండ్రి ఆరోపించారు. దీనిపై బాధితురాలి కుటుంబం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడు అర్జున్ శర్మ దేశం విడిచి పారిపోయాడని నిర్ధారించిన అమెరికా పోలీసులు భారత అధికారులను సంప్రదించగా.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆగ్రాలో దాక్కున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. ఈ కేసుపై మరింత సమగ్ర విచారణ జరిపించి, తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్న నిందితుడికి అమెరికా చట్టాల ప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని నిఖిత తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *