Nagababu: ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్ – AP GREEN) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు (MLC) కొణిదెల నాగబాబు శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాగబాబుకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ సహా పలువురు ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి ‘ఏపీ గ్రీన్’..
బాధ్యతల స్వీకరణ అనంతరం నాగబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రగతి ప్రయాణం ప్రకృతి ఒడిలో సాగాలని ఆకాంక్షించారు. ఉన్న అడవులను కాపాడుకుంటూనే కొత్త అడవులను సృష్టించి, చెట్ల ఫలసాయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ‘ఏపీ గ్రీన్’ రూపుదిద్దుకుందని వివరించారు.
-
స్వయం ప్రతిపత్తి సంస్థ: ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసే ఈ సంస్థలో అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్, విద్యా, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు ఇంకా ప్రజలు భాగస్వాములుగా ఉంటారు.
-
లక్ష్యాల కార్యాచరణ: ప్రస్తుతం రాష్ట్రంలో 22.96% (37.42 లక్షల హెక్టార్లు)గా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని.. 2030 నాటికి 33 శాతానికి, 2047 నాటికి 50 శాతానికి పెంచడమే ప్రధాన లక్ష్యం.
క్షేత్రస్థాయి అమలు – ఆధునిక సాంకేతికత..
-
విస్తృత మొక్కల పెంపకం: ఫార్మ్ ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ, అవెన్యూ ప్లాంటేషన్లు, కాలువ గట్లు, బంజరు భూములు, మైనింగ్ ప్రాంతాలు ఇంకా ఎకో సెన్సిటివ్ జోన్లలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతారు.
-
డిజిటల్ మానిటరింగ్: నాటిన ప్రతి మొక్క మనుగడను పర్యవేక్షించేందుకు GIS మ్యాపింగ్, జియో-ట్యాగింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తారు.
-
నిధుల సమీకరణ: ప్రభుత్వ గ్రాంట్లు, నాబార్డ్ (NABARD), కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు, కార్బన్ క్రెడిట్లు, గ్రీన్ బాండ్లు మరియు ఎకో-టూరిజం ద్వారా ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు.
మూడంచెల పరిపాలనా వ్యవస్థ..
-
రాష్ట్ర స్థాయి పాలక మండలి (State Governing Body): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన (ఛైర్మన్), ఏపీ గ్రీన్ ఛైర్మన్ వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, నిపుణులతో కలిపి మొత్తం 24 మంది సభ్యులు ఉంటారు. ఏటా రెండుసార్లు ఈ పాలక మండలి సమావేశమవుతుంది.
-
ఎగ్జిక్యూటివ్ కమిటీ: కేబినెట్ హోదా కలిగిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు అధ్యక్షతన ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమై పథకాల అమలును పర్యవేక్షిస్తుంది.
-
జిల్లా స్థాయి ఏజెన్సీ (DGDA): జిల్లా జాయింట్ కలెక్టర్ (JC) అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను అమలు చేస్తారు.
రాష్ట్ర భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విజన్కు అనుగుణంగా చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
