సంక్షోభం నుంచి పునర్నిర్మాణం – అడ్మినిస్ట్రేటర్గా తొలి అడుగులు..
పరిపాలనా అనుభవం ఏమాత్రం లేకపోయినా, భూకంపంతో కుదేలైన నగరాలు, కరువుతో అల్లాడిన గుజరాత్ను గాడిలో పెట్టేందుకు ఆయన నడుం బిగించారు. ప్రాజెక్టులకు కచ్చితమైన గడువులు విధించడం, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం ద్వారా తొలి సమావేశంలోనే తన మార్క్ చూపించారు. ఆనాడు ఆయన అమలు చేసిన ‘100 రోజుల ప్రణాళిక’ విధానాలే 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భాగమయ్యాయి.
పేదల కోసం పనిచేయి.. లంచం తీసుకోకు.. తల్లి ఇచ్చిన జీవిత పాఠం..
సమాజంలో చివరి వ్యక్తికి సైతం అభివృద్ధి ఫలాలు అందాలన్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే మోదీ సంక్షేమ పథకాలకు బలమైన పునాదిగా నిలిచింది.
తల్లి చెప్పిన రెండు సూత్రాలు..
సీఎంగా బాధ్యతలు చేపట్టాక మా అమ్మ నాకు రెండు మాటలు చెప్పింది. ఎప్పుడూ పేదల కోసమే పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ లంచం తీసుకోకూడదని చెప్పింది” అని ప్రధాని మోదీ గతంలో గుర్తుచేసుకున్నారు. ఆ విలువలే తన పాలనకు దిక్సూచిగా నిలిచాయని తెలిపారు.
దేశాన్ని కట్టిపడేసిన ‘గుజరాత్ మోడల్’..
ఎండిపోయిన భూములకు నర్మదా జలాల తరలింపు, విస్తృతమైన రహదారులు, 24 గంటల విద్యుత్, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే వైబ్రెంట్ గుజరాత్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. 1995-2001 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన క్షేత్రస్థాయి అనుభవంతో గుజరాత్ మోడల్ను జాతీయ స్థాయిలో అమలు చేశారు. ఇది బీజేపీని దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టింది.
సైద్ధాంతిక లక్ష్యాల సాధన – ప్రపంచ వేదికపై భారత్..
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం, జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వంటి బీజేపీ సైద్ధాంతిక లక్ష్యాలను మోదీ హయాంలోనే విజయవంతంగా పూర్తి చేశారు.
క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ వంటి వినూత్న వ్యవస్థలను ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా జెన్-జీ యువతతో నేరుగా కనెక్ట్ అవుతూనే, ప్రపంచ దేశాధినేతలతో బలమైన దౌత్య సంబంధాలు నెరపి అంతర్జాతీయ వేదికలపై భారత్ పరపతిని అగ్రస్థానానికి చేర్చారు.
మున్ముందు ఉన్న రాజకీయ సవాళ్లు..
వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ, లోక్సభలో సొంత మెజారిటీ లేకపోవడంతో టీడీపీ, జేడీయూ వంటి కీలక భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది.
యువత సమస్యలు & భౌగోళిక ఉద్రిక్తతలు
పరీక్షల పేపర్ లీకేజీల నియంత్రణ, నిరుద్యోగం, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాల వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావాలు సవాలుగా మారాయి.
2029 టార్గెట్
ఎన్ని సవాళ్లు ఉన్నా నేటికీ దేశంలో తిరుగులేని పాపులారిటీ కలిగిన నేతగా మోదీ కొనసాగుతున్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికలకు కూడా మోదీ చరిష్మానే తమకు తిరుగులేని బలమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.