Delhi: ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. నైజీరియా, గయానా పర్యటనలు సహా బ్రెజిల్లో నిర్వహించే జీ 20 సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. 16వ తేదీన ప్రధాని మోదీ నేరుగా నైజీరియా చేరుకుంటారు. అక్కడ ఆ దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబుతో భేటీ అవుతారు. 17 ఏళ్ల తర్వాత ఈ దేశానికి వెళ్లిన తొలి ప్రధాని మోదీనే. రెండు రోజులు ఈ దేశ పర్యటనలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్నారు.
జీ20 సదస్సులో పాల్గొనడానికి 18న బ్రెజిల్లోని రియో డీజెనిరోకు వెళ్లుతారు. అనేక అంతర్జాతీయ అంశాలపై భారత్ తన వైఖరిని వినిపించనుంది. మరుసటి రోజు నుంచి 21వ తేదీ వరకు ప్రధాని మోడీ గయానాలో ఉంటారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానా వెళ్లుతున్న ప్రధాని మోడీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తారు. కరీబియన్ దేశాలతో దృఢమైన బంధాలను ఏర్పాటు చేసుకోవడానికి కరికోమ్-ఇండియా సదస్సుకు హాజరై మాట్లాడుతారు.