Jana Nayagan: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు అడ్డంకులు తొలగడం లేదు. ఈ సినిమా సెన్సార్ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం కీలక తీర్పునిచ్చింది. గతంలో ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
ఈ వివాదం మొత్తం సెన్సార్ బోర్డ్ (CBFC) అభ్యంతరాల చుట్టూ తిరుగుతోంది. సినిమాలో కొన్ని డైలాగులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ వాదిస్తోంది. దీనిపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెన్సార్ బోర్డ్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. తాజాగా డివిజన్ బెంచ్ ఈ కేసును తిరిగి సింగిల్ బెంచ్కు పంపుతూ, సెన్సార్ బోర్డ్ వాదనలను కూడా విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: నేడు సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. అటు పాలన.. ఇటు పార్టీపై ఫుల్ ఫోకస్!
నిజానికి ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందని ఆశపడ్డ విజయ్ అభిమానులకు, డివిజన్ బెంచ్ తాజా నిర్ణయంతో మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ‘జన నాయగన్’ వర్సెస్ సెన్సార్ బోర్డ్ వివాదం మళ్లీ మొదటికి చేరినట్లయింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, తన రాజకీయ ప్రయాణంలో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విజయ్. ఇప్పుడు కోర్టు తీర్పుతో విడుదల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మరి విజయ్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేక హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం వేచి చూస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
